అప్పుడు యోగీ రాముడు...ఇప్పుడు రావణుడు: ఎస్పీలోకి సునీల్ సింగ్..ఎవరీయన?
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీకి షాక్ తగిలింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్కు కుడిభుజంగా వ్యవహరించే హిందూ యువవాహినీ మాజీ అధ్యక్షుడు సునీల్ సింగ్ కమలం పార్టీకి గుడ్బై చెప్పి సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు యోగీ ఆదిత్యనాథ్ను శ్రీరాముడు, హనుమంతుడితో పోల్చిన సునీల్ సింగ్ శనివారం సమాజ్ వాదీ పార్టీ కండువా కప్పుకోగానే స్వరం మార్చారు. యోగీ ఆదిత్యానాథ్ ఒక రావణుడని తేల్చేశారు. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్లోని విద్యార్థులను, రైతులను మహిళలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.
యోగీ ఆదిత్యానాథ్కు కుడిభుజంగా వ్యవహరించే సునీల్ సింగ్ వారం క్రితం సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను కలిసి పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తన మద్దతుదారులు కూడా సమాజ్ వాదీ పార్టీలో చేరతారని అప్పుడు కలిసిన సందర్భంలో సునీల్ సింగ్ చెప్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్తో బేదాభిప్రాయాలు రావడంతో హిందూ యువ వాహిని నుంచి ఆయన్ను బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత జాతీయభద్రతా చట్టంను ఉల్లంఘించారని పేర్కొంటూ సునీల్ను జైలుకు పంపడం జరిగింది. హిందూ యువ వాహిని ఆయనపై బహిష్కరణ వేటు వేయడంతో హిందూ యువవాహిని భారత్ అనేపేరుతో మరో సంఘాన్ని స్థాపించారు.
ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ అన్ని వర్గాల వారిని మోసం చేస్తోందని ధ్వజమెత్తిన సునీల్ సింగ్.. ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో యువత ముందుకు కదలాలని సునీల్ సింగ్ అన్నారు. తన మద్దతుదారులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. 2022లో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ పడిపోయి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ విధానాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉందని చెప్పిన సునీల్ సింగ్... 2022లో కచ్చితంగా బీజేపీని కూల్చేస్తామని చెప్పారు.
2019లో జైలు నుంచి విడుదలైన సునీల్ సింగ్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల బరిలో నిల్చోవాలని భావించారు.అయితే నామినేషన్ రద్దు కావడంతో పోటీ చేయలేకపోయారు. రామచరితమానస్లో సీతను ఎత్తుకెళ్లేందుకు రావణుడు కాషాయం వస్త్రాలు ధరించాడని ఇప్పుడు రావణుడు యోగీ ఆదిత్యనాథ్ రూపంలో పుట్టాడని ఎద్దేవా చేశారు సునీల్ సింగ్. యూపీ సర్కార్ యువత కన్న కలలను చిదిమేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు సునీస్ సింగ్.