షాకింగ్: మదరసాలో 51 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఓ మదరసాలో సుమారు 51 మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. లక్నోలోని షహదాత్గంజ్ ప్రాంతంలో ఉన్న మదరసా నుంచి పోలీసులు వాళ్లకు విముక్తి కల్పించారు.
అనంతరం మదరసాకు చెందిన మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మదరసాలో మొత్తం 125 మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. మేనేజర్ లైంగికంగా వేధిస్తున్నట్లు కొందరు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు శుక్రవారం మదరసాపై జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ 51మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్లందర్నీ మేనేజర్ చెర నుంచి విడిపించారు.
బాధితుల ఫిర్యాదులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. కొన్ని సందర్భాల్లో మదరసా మేనేజర్ అమ్మాయిలను కొట్టేవాడని, వాళ్లతో డ్యాన్స్ కూడా చేయించేవాడని పోలీసులు తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.