ఆ ఇంటికి అనుకోని అతిథి: కిచెన్లో ప్రత్యక్షమైన భారీ కొండచిలువ
Recommended Video
గురుగ్రామ్ : తెల్లవారు జామునే నిద్ర లేచి టీ పెడదామని కిచెన్లోకి వెళ్లింది సుమన్ గౌతమ్ అనే మహిళ. రోజూలానే లైటర్ తీసుకుని స్టవ్ను వెలిగించే ప్రయత్నం చేసింది. అప్పటికే ఏదో తెలియని శబ్దం తనకు వినపడుతోంది. ఏంటా శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని కిచెన్లో కలియతిరిగింది. వెంటనే షాక్కు గురైంది. కిచెన్లోకి అనుకోని అతిథి ప్రత్యక్ష్యమైంది. ఇంతకీ ఆ అతిథి ఎవరనుకుంటున్నారా... సుమన్ గౌతంను అంతలా భయపెట్టేలా చేసిన ఆ గెస్ట్ ఓ ఐదుడుగుల పెద్ద కొండచిలువ.
వివరాల్లోకి వెళితే... గురుగ్రామ్ శీతల కాలనీలో సతీష్ కుమార్ గౌతమ్, సుమన్ గౌతమ్ అనే దంపతులు నివాసముంతుటున్నారు. సతీష్ చీకట్లోనే లేచి తన ఆఫీస్కు బయలుదేరాడు. భర్తను సాగనంపిన భార్య సుమన గౌతమ్ తిరిగి పడకపైకి చేరుకుని కాసేపు కునుకు తీసింది. ఆ తర్వాత నిద్ర లేచి...టీ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్లింది. అంతే అక్కడ కొండచిలువ నక్కి ఉండటాన్ని చూసి షాక్ నుంచి తేరుకోలేకపోయింది. గట్టిగా కేకలు వేద్దామా అంటే పాము తనపై దాడి చేస్తుందేమోనని భయపడింది. షాక్ నుంచి 10 నిమిషాలకు తేరుకున్న సుమన ఆఫీస్కు వెళ్లిన తన భర్తకు ఫోన్ చేసింది.
"నా భార్య నాకు ఫోన్ చేసినప్పుడు తన గొంతులో భయం కనిపించింది. కిచెన్లో పెద్ద కొండచిలువ ఉంది అని చెప్పింది. వెంటనే నేను అటవీశాఖ అధికారులకు , పాములు పట్టేవారికి ఫోన్ చేశాను. వెంటనే తన ఇంటికి వెళ్లాల్సిందిగా కోరాను. నా భార్య ఇప్పటి వరకు అంత పెద్ద పామును జీవితంలో చూడలేదు" అని సతీష్ గౌతమ్ చెప్పాడు.
వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీమ్ ఇంటికి చేరుకునే సరికి మరో గంట సమయం పట్టింది. అప్పటికే కిచెన్లో పెద్ద పాము దూరిందట అని కాలనీ మొత్తానికి తెలిసిపోయింది. అందరూ సుమన్ గౌతమ్ ఇంటిముందు గుమికూడారు. సతీష్ తనకు ఫోన్ చేసిన సమయంలో తాను ఫరీదాబాద్లో ఉన్నట్లు చెప్పిన రెస్క్యూ టీమ్ వ్యక్తి అనిల్... తను చేరుకునే సరికి ఆ పాము తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని వివరించాడు. సాధారణంగా కొండచిలువలు చిన్న గ్రామాల్లో తిరుగుతుంటాయని... పెద్ద నివాసంలోకి చొరబడటం ఇదే తొలిసారని అనిల్ చెప్పాడు.
గురుగ్రామ్ ప్రజల్లో ఇలాంటి ప్రమాదకరమైన జంతువులు నివాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు ఫోన్ చేస్తున్నారని... ఇది శుభపరిణామమని అనిల్ అన్నాడు. ఈ పాములు ఆహారం కోసం తచ్చాడుతూ నివాస ప్రాంతాల్లో ఉన్న ఎలుకలు, కప్పలులాంటి జీవాల కోసం వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు గురుగ్రామ్ ప్రజల నుంచి వణ్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి 698 ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పిన అధికారులు... మరికొంత మంది కంగారుపడి పాములను కొట్టి చంపేస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాలకే మరో నాగుపాము గడోలి కుర్ద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నట్లు ఫోన్ రావడంతో రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి దాన్ని కూడా బంధించి రెండు పాములను అటవీ ప్రాంతంలో వదిలేశారు.