అనాగరికం: అత్తింటి వ్యక్తిని భుజాలపై ఎక్కించి, మహిళను 3కి.మీ పరుగెత్తించారు(వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. అత్తింటికి చెందిన ఓ వ్యక్తిని భుజాలపై ఎక్కించుకుని మహిళ సుమారు మూడు కిలోమీటర్ల నడిచింది. ఇదంతా అత్తింటివారు బలంతంగా చేయించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సగాయి-బ్యాన్స్ ఖేడి గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళకు, ఈ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే, గత కొంత కాలం క్రితం వీరు పరస్పర అంగీకారంతో విడిపోయారు.
ఈ క్రమంలో సదరు వివాహిత మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, అత్తింటివారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. బలవంతంగా ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లి.. అత్తింటివారి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని ఆమె భుజాలపై కూర్చోబెట్టి ఊరంతా నడిపించారు.
A married tribal woman in Guna was beaten up, shamed and forced to carry her relatives on her shoulders as punishment @ndtv @ndtvindia @NCWIndia @sharmarekha @ChouhanShivraj @drnarottammisra @OfficeOfKNath @manishndtv @GargiRawat @vinodkapri @rohini_sgh pic.twitter.com/H8ZJL8m86g
— Anurag Dwary (@Anurag_Dwary) February 15, 2021
సుమారు 3 కిలోమీటర్లకుపైగా ఆమె ఇలా నడిచింది. ఆమె ఆగిన ప్రతిసారి ఆమె వెంట వచ్చినవారు కర్రలు, బ్యాట్లతో ఆమెను కొట్టారు. దీంతో ఆమె ఆగకుండా నడిచింది. ఇలా మూడు కిలోమీటర్ల మేర ఆమెను నడిపించారు. గ్రామంలో ఆమెను చూస్తూ కేరింతలు కొట్టారే తప్ప.. ఎవరూ కూడా ఆమెకు మద్దతుగా నిలవకపోవడం విచారకరం.
ఈ వీడియో వైరల్ కావడం, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి భర్తతోపాటు మరో ఏడుగురు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పలు మారుమూల గ్రామాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం.