షాకింగ్ ... ఎన్నికల సమయంలో బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబులతో మావోల దాడి
ఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీహార్ లో మావోలు రెచ్చిపోయారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో మావోల దాడి ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏకంగా బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీకి మిత్రపక్షమైన బిజెపి ఎమ్మెల్సీ ఇంటిపైనే బాంబులతో దాడులకు తెగబడ్డారు. అయితే ఈ దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ బాంబు పేలుడు దాడికి ఇల్లు మొత్తం ధ్వంసమై ఆస్తి నష్టం జరిగింది.
డుమ్రియా లో బీజేపీ నేత ఇంటిపై మావోల దాడి
గయ జిల్లా డుమ్రియా ప్రాంతానికి చెందిన బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిపై అర్థరాత్రి సమయంలో మావోలు దాడికి పాల్పడ్డారు. డైనమైట్స్ సాయంతో ఇంటిని పేల్చేసి బీభత్సం సృష్టించారు.భయానక వాతావరణాన్ని కల్పించారు.
ఇంటిని పేల్చేసిన మావోలు.. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో తప్పిన ప్రాణాపాయం
ఈ దాడిలో దాదాపు 20-30 మంది తో కూడిన సిపిఐ కి చెందిన మావోల దళం పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. భారీ మరణాయుధాలతో ఎమ్మెల్సీ ఇంటి వద్దకు ప్రవేశించిన వారు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారని...దీంతో ఇళ్లు మొత్తం ద్వంసం అయిందని పేర్కొన్నారు. ఈ దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పిందని మిశ్రా వెల్లడించారు.
ఎన్నికల బహిష్కరణ లక్ష్యంగా దాడి ... హెచ్చరిక పోస్టర్లు
ఎన్నికలు నిర్వహణ బహిష్కరించాలని టార్గెట్ గా దాడి చేసిన మావోలు దాడి అనంతరం నక్సల్స్ ఎన్నికలు బహిష్కరించాలని పేర్కొంటూ కొన్ని పోస్టర్లు అక్కడ అతికించి వెళ్లారు. ఎన్నికలు జరిపితే ఇలాంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికగా ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ పోస్టర్లు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్నారు.