ఎస్పీ బాలు ఇక లేరు .. శోక సంద్రంలో అభిమానులు... ఇంటివద్ద భారీగా పోలీసులు
తెలుగు సినీ చరిత్రలోనే విషాదకరమైన రోజు . గాన గంధర్వుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఈ రోజు. ఎస్పీ బాలసుబ్రమణ్యం అనారోగ్యం కారణంగా నేడు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 74. ఆగస్టు మొదటి వారంలో కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం, నాటి నుండి నేటి వరకు పోరాటం సాగించారు. ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉన్న దర్శకుడు వెంకట్ ప్రభు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో సంగీత ప్రపంచ శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరిగి కోలుకోవాలని పలువురు ప్రముఖులు, దేశ విదేశాల్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేశారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనారోగ్యానికి గురైన ఎస్పీ బాలసుబ్రమణ్యం అనారోగ్యంతో పోరాడి పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఆయన ఆరోగ్యం క్షీణించగా ఎక్మో సహాయంతో వైద్యం అందించారు. అయినప్పటికీ తిరిగిరాని లోకాలకు బాలసుబ్రమణ్యం చేరిపోయారు. గానగంధర్వుడు అందరినీ కన్నీటి సంద్రంలో ముంచి వెళ్లిపోయారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు .ఎస్పీ బాలు నివాసం వద్ద వీధులను శుభ్రంచేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. బాలసుబ్రమణ్యం మరణంతో సంగీత ప్రపంచం, సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక లెజెండరీ సింగర్ ను సినీ ప్రపంచం కోల్పోయింది.
ఎస్పీబీ ఎంతో ప్రత్యేకం ... సినీ రంగంలో ఆయన ప్రతిభకు లేదు కొలమానం ఆరు జాతీయ అవార్డులను అందుకున్న ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 16 భాషలలో 40,000 పాటలను పాడి నేపధ్య గాయకుల్లో అగ్రగణ్యుడిగా నిలిచారు. ఆయన ఇళయరాజా, ఎ ఆర్ రెహమాన్ వంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లతో కలిసి పనిచేశాడు. ఆయన నటుడు, నిర్మాత మాత్రమే కాకుండా తన వాయిస్ ను నటులకు డబ్బింగ్ కూడా అందించారు . బాలసుబ్రహ్మణ్యం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ మరియు పద్మ భూషణ్ లను అందుకున్న విషయం తెలిసిందే . బహుముఖ ప్రజ్ఞా శాలిగా ఆయన ప్రతిభ అనన్య సామాన్యం.