ఆ ఎగ్జామ్ లో షాకింగ్ ప్రశ్నలు ... గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు ? మద్యం విక్రయాలు పెంచాలంటే ..
విద్యా ప్రమాణాలు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి అని చెప్పడానికి ఓ పాఠశాలలో పెట్టిన పరీక్షలే ఉదాహరణ. విద్యార్థులను ఏ ప్రశ్న అడగొచ్చు, ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పరీక్షా పత్రాన్ని తయారు చేసిన ఉపాధ్యాయులు చేసిన పని అందరినీ షాక్ కు గురి చేసింది. విస్మయాన్ని కలిగించిన ఉపాధ్యాయుల ప్రశ్నలకు విద్యాశాఖ అధికారులు ఖంగు తిన్నారంటే ఎంత గొప్ప ప్రశ్నలడిగారో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఎక్కడ , ఏ పరీక్షలలో జరిగింది అనే అసలు విషయానికి వస్తే గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో సుఫలాంశాల వికాస్ సంకుల్ పాఠశాలలో విద్యార్థులను పరీక్షలలో సమాధానం రాయమని అడిగిన ప్రశ్నలు విద్యార్థులను, విద్యాశాఖ అధికారులను షాక్ కు గురి చేశాయి . గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నారా? అంటూ 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో ప్రశ్నగా ఇచ్చారు. అలాగే 12వ తరగతి ప్రశ్నపత్రంలోనూ మీ ప్రాంతంలో మద్యం విక్రయాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాయండి అనే మరో విచిత్ర ప్రశ్న కూడా విద్యార్థులకు ఇచ్చారు ఉపాధ్యాయులు. దీంతో ఖంగుతున్న అధికారులు ప్రశ్నపత్రాలు తయారు చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
గతంలో ఇలాంటి అభ్యంతరకరమైన ప్రశ్నలు తమిళనాడులోని ఓ పాఠశాల ప్రశ్నపత్రంలో ఎదురయ్యాయి. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ట్విట్టర్ వేదికగా పత్రాలలోని ప్రశ్నల విషయంలో తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో ఏపీలోనూ ఈ తరహా వివాదాస్పద ప్రశ్నలు పరీక్షలలో ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఇక తాజాగా గుజరాత్లోని పాఠశాలలో పరీక్షలకు ఇచ్చిన ప్రశ్నల గురించి విద్యాశాఖ అధికారి భరత్ వధేరా మాట్లాడుతూ గవర్నమెంట్ గ్రాంట్స్తో రన్ చేస్తున్న ఎయిడెడ్ పాఠశాల అయిన సుఫలాంశాల వికాస్ సంకుల్ లాంటి పాఠశాలలో నాణ్యమైన భోదన ఉండదని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్లే రూపొందిస్తారని ఆయన తెలిపారు.
ఇక ఆ ప్రశ్నపత్రాలతో రాష్ట్ర విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వెంటనే ఇలాంటి పాఠశాలలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు జిల్లా డీఈఓ భరత్ వధేరా తెలిపారు.