షాకింగ్: గాయపడిన వ్యక్తికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు.. రాజాం ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన...
శ్రీకాకుళం జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. రాజాం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంట్ గాయాలకు సెక్యూరిటీ గార్డు కుట్లు వేశాడు. వైద్యులు చేయాల్సిన పని సెక్యూరిటీ గార్డు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం తెలియని సెక్యూరిటీ గార్డుతో ఆ పని ఎలా చేయించారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సెక్యూరిటీ గార్డు సంజీవి...
ఆస్పత్రిలో సోఫాపై పడుకున్న పేషెంట్కు తల భాగంలో సెక్యూరిటీ గార్డు కుట్లు వేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో పారామెడికల్ స్టాఫ్ గానీ వైద్యులు గానీ అక్కడ ఎవరూ లేరు. తెలియవస్తున్న సమాచారం ప్రకారం... సంజీవి అనే ఆ సెక్యూరిటీ గార్డు గతంలో క్వాక్(మెడికల్ సిబ్బంది)గా పనిచేశాడు. ప్రథమ చికిత్స చేయడంలో అతనికి శిక్షణ,అనుభవం ఉంది. గతంలో చాలామంది గాయాలకు కుట్లు వేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి గాయాలతో వచ్చిన వ్యక్తికి అతను కుట్లు వేసినట్లు తెలుస్తోంది.
అధికారులు ఏమంటున్నారు...
ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి సూర్యారావును సంప్రదించగా... ఒక పేషెంట్కు సెక్యూరిటీ గార్డు ట్రీట్మెంట్ అందించకూడదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నుంచి దీనిపై వివరణ కోరుతామని చెప్పారు. మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాయుడు స్పందిస్తూ... ఆ సెక్యూరిటీ గార్డుకు ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ,అనుభవం ఉందన్నారు. ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అతని సేవలు ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. లేదంటే... ఉన్నా అరకొరా సిబ్బందితో పేషెంట్లను చూసుకోవడం కష్టమన్నారు. శిక్షణ కలిగిన వ్యక్తులు వైద్య చికిత్స అందించేందుకు అనుమతి ఉంటుందన్నారు.
మెట్టువలసలో ఘర్షణలో 20మందికి గాయాలు...
గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి జిల్లాలోని మెట్టువలస గ్రామంలో మంగళవారం(ఫిబ్రవరి 23) వైసీపీ,టీడీపీ శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డాడు. సోషల్ మీడియాలో పోస్టులపై తలెత్తిన ఈ రాజకీయ వివాదంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కర్రలు,ఇటుకలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... వారిలో కొంతమందికి ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు కుట్లు వేశాడు.