జ్ఞానవాపి మసీదు సర్వేలో సంచలనాలు-శేషనాగు పడగ, త్రిశూలం, ఢమరుకం ప్రత్యక్ష్యం
వారణాసిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదులో మూడు రోజుల పాటు నిర్వహించిన సర్వే నివేదిక సంచలనం రేపుతోంది. ఈ సర్వేలో శివలింగం బయటపడినట్లు ఇప్పటికే లీకు ఇచ్చిన సర్వే అధికారిని వారణాసి కోర్టు విధుల నుంచి తప్పించింది. ఇప్పుడు మరికొన్ని వస్తువులు కూడా బయటపడినట్లు వారణాసి కోర్టుకు ఇవాళ నివేదిక సమర్పించిన సర్వేయర్లు వెల్లడించారు.
జ్ఞాన్వాపి మసీదు కేసులో హిందూ పిటిషనర్ల తరపున హాజరైన న్యాయవాది అజయ్ మిశ్రా కోర్టు ఆదేశించిన సర్వేలో అనేక హిందూ దేవతల విగ్రహాల విరిగిన ముక్కలు కనుకొన్నట్లు వెల్లడించారు. దేవాలయం నుంచి వచ్చిన శిథిలాల్లా కనిపించే శిధిలాలలో "శేషనాగ్" (హిందూ పురాణాలలో ఒక పెద్ద పాము) కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. తనను నేలమాళిగలోకి అనుమతించలేదని, శిధిలాలు 500-600 సంవత్సరాల నాటివిగా అనిపించాయని, అని వారణాసి కోర్టులో సర్వే నివేదికను సమర్పించిన తర్వాత అజయ్ మిశ్రా మీడియాకు వెల్లడించారు.
మూడు రోజుల పాటు జ్ఞానవాపి మసీదుపై వీడియో సర్వే నిర్వహించిన బృందంలో అజయ్ మిశ్రా కూడా ఉన్నారు. సర్వేలో మసీదు పాలనా యంత్రాంగం సహకరించలేదని, బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.మసీదు ఆవరణలో గోపురం ఆకారపు నిర్మాణం ఉందని మిశ్రా ధృవీకరించారు కానీ తన నివేదికలో అదే విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పారు. ఈ కట్టడాన్ని హిందువులు శివలింగంగా పేర్కొంటున్నారు. అయితే, మసీదు కమిటీ ఈ వాదనను తోసిపుచ్చింది. ఇది ఫౌంటెన్ అని పేర్కొంది.
ప్రత్యేక కోర్టు కమిషనర్ విశాల్ సింగ్ ఇవాళ కోర్టుకు అధికారికంగా నివేదిక సమర్పించారు, ఇందులో ఆయన మసీదు లోపల సనాతన సంస్కృతికి సంబంధించిన అనేక చిహ్నాలు ఉన్నాయని వెల్లడించారు. సనాతన ధర్మ సంకేతాలైన కమలం, దమ్రు (చిన్న రెండు తలల డ్రమ్), త్రిశూలం వంటివి నేలమాళిగ గోడలపై ఉన్నట్లు తెలిపారు. సర్వేకు సంబంధించిన వీడియో మెమరీ చిప్ను కూడా కమిషనర్ కోర్టుకు సమర్పించారు. కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాను వారణాసి కోర్టు గతంలో తొలగించింది. మిశ్రా ఒక ప్రైవేట్ కెమెరామెన్ని నియమించుకున్నారని, ఆయన ఇప్పుడు పత్రికలకు లీక్ చేశారని ఆరోపణలు వచ్చాయి.