షాకింగ్ దొంగతనం, పోలీసులే షాకయ్యారు (వీడియో)
ముంబై: మహారాష్ట్రలోని నావీ ముంబైలో షాకింగ్ దొంగతనం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ దొంగతనం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నప్లిలలతో రెస్టారెంటుకు వచ్చి చాకచక్యంగా డబ్బు దొంగిలించారు.
దొంగతనం విషయమై సీసీటీవీ ఫుటేజీలో చూసిన రెస్టారెంట్ యజమాని, పోలీసులు కూడా షాకయ్యారు. ఆ దొంగతనం చేసింది చిన్నపాప.
గతవారం నావీ ముంబయిలోని ఓ రెస్టారెంటుకు ముగ్గురు మహిళలు నీలం రంగు దుపట్టాలు కప్పుకుని వచ్చారు. వారితో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు రెస్టారెంటు యజమానిని, అక్కడున్న ఇతర వ్యక్తులను మాటల్లో పెట్టగా వారితో వచ్చిన చిన్న పాప మెల్లిగా కౌంటర్ వద్దకెళ్లి డ్రా తెరిచే ప్రయత్నం చేసింది.
తాళం వేసి ఉండడంతో పక్కన మరో డ్రా తీసి తాళం చెవిని వెతికి మరీ డ్రా తెరిచి అందులో ఉన్న డబ్బు కట్టలు సంచిలో వేసుకుంది. మళ్లీ తాళం వేసి తాళం చెవి మరో డ్రాలో పెట్టేసి బయటకు వచ్చింది. వెంటనే ఆ ముగ్గురు మహిళలు కూడా బయటకు వచ్చేశారు.
తర్వాత యజమాని ప్రియాంక డ్రా తెరిచి చూసుకునే సరికి రూ.20,500 పోయింది. సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఈ దొంగతనం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. మరో ఇద్దరు చిన్నారులను అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు.