విజయ్ మాల్యా కేసులో షాకింగ్ ట్విస్ట్ .. సుప్రీంకోర్టులో కీలక పత్రాలు మాయం
భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు కింగ్ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యా కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది . ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు టోపీ పెట్టిన ఎగవేత దారుడు, వైట్ కాలర్ నేరస్తుడు, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ మాల్యాను తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం కేంద్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ మాల్యా కేసు ... ముఖ్యమైన పత్రాలు మాయం
ఇదే సమయంలో సుప్రీంకోర్టులో విజయ్ మాల్యా కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పత్రాలు మాయం కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రభుత్వబ్యాంకులకుతొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్ లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇదికోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
విజయ్ మాల్యా రివ్యూ పిటీషన్ పై విచారణ..వెలుగులోకి డాక్యుమెంట్స్ మిస్సింగ్
దీంతో పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపు వ్యవహారంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14 2017 నాడు తీర్పు ఇచ్చింది కోర్టు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా విజయ్ మాల్యా సమీక్ష పిటిషన్ ను దాఖలు చేసిన నేపథ్యంలో, ఈ సమీక్ష పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు మిస్ అయ్యాయని గుర్తించారు న్యాయమూర్తులు.
రిజిస్ట్రీకి ధర్మాసనం కీలక ఆదేశాలు ... విచారణ ఆగస్టు 20 కి వాయిదా
దీంతో గత మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ రివ్యూ పిటిషన్ కు సంబంధించిన ఫైల్ ను ఏ ఏ అధికారులు డీల్ చేశారో ఆ అందరి వివరాలను అందించాలని ఆదేశించింది ధర్మాసనం . ముఖ్యమైన పత్రాలు మాయం కావటంతో ఈ కేసు విషయంలో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ కేసు విచారణను ఆగస్టు 20 కి వాయిదా వేశారు న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ లు .