రాహుల్కు చేదు అనుభవం: బూటు విసిరిన వ్యక్తి అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మందస్తు ప్రచారానికి దిగిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీపైకి ఓ స్థానికుడు బూటు విసిరాడు. అయితే ఈ బూటు దాడి నుంచి రాహుల్ తృటిలో తప్పించుకున్నాడు.
ఓపెన్ టాప్ జీపులో వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. జీపులో రాహుల్ ముందు కూర్చొని ఉండగా, స్థానికుడు విసిరిన బూటు రాహుల్ వెనుకనే ఉన్న వ్యక్తి చేతిని తాకింది. తనవైపు బూటు విసరడాన్ని రాహుల్గాంధీ గమనించారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇంతలో జీపు పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూటు విసిరిన వ్యక్తిపై దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనంతరం మళ్లీ రాహుల్ గాంధీ తన రోడ్ షోను కొనసాగించారు. కాగా షూ విసిరిన వ్యక్తి జర్నలిస్ట్ అనూప్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. కాగా వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా కిసాన్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
Local hurls a shoe towards Congress VP Rahul Gandhi during his road show in Sitapur(UP),detained by police pic.twitter.com/oU3YsB3Fru
— ANI UP (@ANINewsUP) September 26, 2016