నడిరోడ్డులో ఆ రేపిస్టులను కాల్చి చంపాలి: యూపీ అత్యాచార ఘటనపై కంగనా ఫైర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాచారాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలను తెచ్చినా కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వెన్నులో వణుకు తెచ్చే చట్టాలు ఉన్నప్పటికీ కరుడుగట్టిన కామాంధుల్లో మాత్రం కించిత్ భయమైనా కలగడం లేదు. నిర్భయ ఘటన దేశాన్ని కుదిపేసిన తర్వాత కూడా హైదరాబాదు శివార్లలో దిశ ఘటన మరోసారి దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యింది. దిశ ఘటన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో దేశం మొత్తం దిశ ఘటనతో ఏకమైంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశం మొత్తం రోడ్డెక్కింది. ఇక తాజాగా యూపీలో కూడా ఓ దళిత యువతిపై కామాంధులు కన్నేసి సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన యువతి ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు.
కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ?: బ్యానర్లు: బీజేపీ మిత్రపక్ష పార్టీలో?: కర్ణిసేన ఓటుబ్యాంకు
కొద్ది రోజుల క్రితం దళిత యువతిపై అత్యాచారం
ఉత్తర్ ప్రదేశ్ హత్రస్కు చెందిన 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, సోదరుడితో కలిసి పొలం పనుల కోసం వెళ్లిన బాధితురాలపై హత్రాస్కే చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ నలుగురూ విచక్షణారహితంగా ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇష్టానుసారంగా కొట్టారు. చిత్రవధకు గురి చేశారు. తమ పేర్లను బయటపెట్టకుండా ఉండటానికి బాధితురాలి నాలుకను కత్తిరించారు.
మన కూతుళ్లను కాపాడుకోవడంలో విఫలం
కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన కామాంధులకు కూడా నిర్భయ, దిశ ఘటన నిందితులకు వేసిన శిక్షే వేయాలని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్లు కోరుతున్నారు. అంతేకాదు విచారణ పేరుతో ఏళ్లకు ఏళ్లు జాప్యం చేయకుండా నిందితులకు వెంటనే శిక్ష అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు కూడా మృతురాలికి అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. ముందుగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. నిందితులను నిల్చోబెట్టి కాల్చి చంపాలని ఆమె ట్వీట్ చేశారు. ప్రతి ఏటా పెరిగిపోతున్న ఈ సామూహిక అత్యాచారాల సమస్యకు పరిష్కారం ఏంటని ఆమె ప్రశ్నించారు. దేశానికి ఈ రోజు దుర్దినం అని కంగనా పేర్కొన్నారు. మన కూతుళ్లను మనం కాపాడుకోవడంలో విఫలమయ్యామని ట్వీట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
నిర్భయ నిధులు ఎక్కడికి పోతున్నాయ్
మరోవైపు కాంగ్రెస్ నేత శ్రీవాత్సవ ఘటనపై మండిపడ్డారు. అత్యాచారానికి మరో యువతి బలైందన్నారు. మోడీ పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. నిర్భయ నిధులు ఎందుకు వినియోగించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కడున్నాయ్ అని చెబుతూనే.. రేపిస్టులైన సెన్గర్ చిన్మయానంద్లను బీజేపీ ఎందుకు కాపాడుకుంటూ వస్తోందని ఘాటైన ప్రశ్న సంధించారు. ఇక తాజా ఘటన యూపీలో జరగడంతో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను అత్యంత చెత్త సీఎంగా అభివర్ణించారు.
విచారణ పేరుతో జాప్యం చేయకండి
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఘటనపై స్పందించింది. 19 ఏళ్ల యువతిపై అత్యాచారం జరగడంతో తనువు చాలించిందని చెప్పిన పాయల్ ఘోష్... నిందితులు కస్టడీలో ఉన్నారని పేర్కొంది. సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేసిన పాయల్... జాప్యం చేసేకొద్దీ ఆ బిడ్డకు అన్యాయమే జరుగుతుందని ఘాటు వ్యాఖ్యలను పోస్టు చేసింది. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలంటే కొన్ని నిమిషాల పాటు ఆమెకోసం ప్రార్థన చేయాలంటూ పిలుపునిచ్చింది.