రూ.1కోటి డిమాండ్ చేశారు.. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై షూటర్ సంచలన ఆరోపణలు...
ప్రముఖ అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై సంచలన ఆరోపణలు చేశారు.సెంట్రల్ వుమెన్ కమిషన్లో తనను సభ్యురాలిగా నియమించేందుకు స్మృతీ ఇరానీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆమెతో పాటు మరో ఇద్దరిపై ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో వర్తికా సింగ్ ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయస్థానం వచ్చే జనవరి 2న విచారణ జరపనుంది.
సెంట్రల్ వుమెన్ కమిషన్లో తనను సభ్యురాలిగా నియమిస్తున్నట్లు కేంద్రమంత్రికి సన్నిహితులైన విజయ్ గుప్తా,రజనీష్ సింగ్ తనకు ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని వర్తికా సింగ్ ఆరోపించారు. అంతేకాదు,ఇందుకోసం రూ.1కోటి డిమాండ్ చేశారని... ఆ తర్వాత తన ప్రొఫైల్ను పరిగణలోకి తీసుకుని రూ.25లక్షలకు తగ్గిస్తున్నామని మాట్లాడారన్నారు. ఈ వ్యవహారంపై తనతో మాట్లాడిన ఇద్దరిలో ఒకరు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
కాగా, గత నవంబర్ 23న వర్తికా సింగ్పై విజయ్ గుప్తా ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో ఉన్న ముసాఫిర్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఆమెపై ఆరోపణలు చేశారు. విజయ్ గుప్తా ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీని దర్యాప్తు కూడా కొనసాగుతోంది. మరోవైపు వర్తికా సింగ్ ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఇంతవరకూ స్పందించలేదు.