నిరీక్షణకు తెర: ఇక సెట్స్పైకి సినిమాలు: మాస్కులు లేకుండా: వారికి మాత్రమే మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం సినిమాలు, టీవీ సీరియళ్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. సినిమాల చిత్రీకరణ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొత్త సినిమాలను ప్రకటించడమే తప్ప.. దాన్ని సెట్స్పై ఎక్కించలేని దుస్థితిని ఎదుర్కొన్నాయి ప్రొడక్షన్ హౌస్లు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. అనే తేడా ఏదీ లేదు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. ఒక్క సినిమా కూడా చిత్రీకరణను జరుపుకోలేదు. దీనితో సినిమా రంగం మీద ఆధారపడిన కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎస్ఓపీలను జారీ చేసిన కేంద్రం..
దీనికి కేంద్ర ప్రభుత్వం తెర దించింది. సినిమాలు, టీవీ సీరియళ్ల చిత్రీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన జారీ చేశారు. కోవిడ్-19 ప్రొటొకాల్, నిబంధనలను పాటిస్తూ సినిమాలు, టీవీ సీరియళ్ల చిత్రీకరణను జరుపుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని ఆయన విడుదల చేశారు. షూటింగ్ స్పాట్లో భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ మాస్క్లను తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలనీ పేర్కొన్నారు.
కెమెరా ముందుకొచ్చిన వారికి మాత్రమే
చిత్రీకరణ సమయంలో ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ కేసుల తీవ్రతను జ్ఞప్తిలో ఉంచుకోవాలని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ఒక్క పొరపాటు చోటు చేసుకున్నా.. దాని తాలూకూ దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందని అన్నారు. మాస్కుల నుంచి కొందరికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. కెమెరా ముందుకొచ్చిన వారు మాత్రమే మాస్కులను ధరించనక్కర్లేదని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఇక మిగిలిన వారంతా మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సిందేనని చెప్పారు. కెమెరా ముందు నుంచి పక్కకు వచ్చిన వెంటనే వారు కూడా మాస్కులను పెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు.
Recommended Video
సంజీవినిలాగా..
ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడంలో భాగంగా.. తాము సినిమా, టీవీ సీరియళ్ల షూటింగులకు అనుమతి ఇచ్చినట్లు ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. సినిమా రంగం ఆర్థిక వ్యవస్థకు ఓ సంజీవినిలా పనిచేస్తోందని అన్నారు. పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందించే రంగమని పేర్కొన్నారు. లక్షలాదిమందికి ఉపాధిని కూడా అందిస్తోందని చెప్పారు. ఇక వారంతా షూటింగులను జరుపుకోవచ్చని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. తాము జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను పాటించక తప్పదని చెప్పారు. కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించేంత వరకూ వాటిని పాటించాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు.