చిత్తుగా తాగేసి బార్ యజమానిపై కాల్పులు
బెంగళూరు: మద్యం సేవించిన దుండగులు ఆ తరువాత బార్ యజమానిపై హత్యాయత్నం చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బార్ యజమాని సతీష్ మీద దుండగులు రివాల్వర్ తో కాల్పులు జరపారని పోలీసులు తెలిపారు.
బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ సందీప్ పాటిల్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని రెసిడెన్సీ రోడ్డులో టైమ్స్ బార్ ఉంది. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో బార్ లో యజమాని సతీష్, సిబ్బంది ఉన్నారు.
ఇద్దరు నిందితులు బార్ లో మద్యం సేవించడానికి వెళ్లారు. తరువాత మద్యం సేవించారు. అదే సమయంలో సతీష్ బార్ లో స్టాక్ ఎంత ఉంది అని పరిశీలిస్తున్నాడు. ఒక్క సారిగా బయటకు వచ్చిన ఇద్దరు నిందితులు సతీష్ అంటూ కేకలు వేశారు.
జేబులో ఉన్న రివాల్వర్ లు తీసి కాల్పులు జరిపి పరారైనారు. సతీష్ శరీరంలోకి రెండు బుల్లెట్ లు దూసుకు వెళ్లాయి. వెంటనే సతీష్ ను మాల్య ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ సందీప్ పాటిల్ సంఘటా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మద్యం మత్తులో నిందితులు కాల్పులు జరిపారా, పాతకక్షల కారణంగా సతీష్ ను అంతం చెయ్యడానికి ప్రయత్నించారా అని ఆరా తీస్తున్నారు. బార్ లోని సీసీ టీవీ కెమెరా క్లిప్పింగ్ లను అశోక్ నగర పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.