వారంలో 7 రోజులు.. రోజులో 24 గంటలు.. తమిళనాడులో ఇక ఎప్పుడైనా షాపింగ్..!
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షాపులు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలు అందుబాటులోఉంచాలని నిర్ణయించింది. వారంలో ఏడు రోజులు, రోజులో 24గంటల పాటు షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్లు తెరిచి ఉంచేలా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఈ ప్రతిపాదన చేయగా... దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త విధానం మూడేళ్ల పాటు కొనసాగనుంది. వ్యాపార, వాణిజ్య అభివృద్ధితో పాటు మహిళా ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
2016లో నరేంద్రమోడీ ప్రభుత్వం మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం సినిమా థియేటర్లు, హోటళ్లు, షాపులు సహా రిటైల్, కమర్షియల్ షాపులు వారంలో ఏడు రోజులు రోజులో 24గంటల పాటు తెరిచి ఉంచవచ్చు. రాష్ట్రాలు తమ ప్రాంత అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు.
2017లో మహారాష్ట్ర ఈ విధానాన్ని అమలుచేయగా.. ఆ తర్వాత గుజరాత్ కూడా అదే బాట అనుసరించింది. తాజాగా తమిళనాడు ఆ లిస్టులో చేరింది. కొత్త చట్టం ప్రకారం ఇకపై రాత్రిపూట పనిచేసే మహిళల భద్రతకు సంబంధించి ఆయా సంస్థల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకోనున్నారు. నైట్ షిఫ్టుల్లో పనిచేసే మహిళల ట్రాన్స్పోర్ట్ బాధ్యతను కంపెనీలే చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్లలో నోటీస్ డిస్ ప్లే చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడు సర్కారు నిర్ణయంపై సంస్థలతో పాటు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.