‘ఆస్మిత’ నినాదం: అసంతృప్తితో రగులుతున్న నితిన్.. బాధ్యతల స్వీకరానికి దూరం
గాంధీనగర్ : కొత్తగా ఏర్పాటైన గుజరాత్ కేబినెట్లో శాఖల కిరికిరి మొదలైంది. విజయ్ రూపానీ ప్రభుత్వానికి ఇక్కట్లు మొదలయ్యాయి. మొన్నటిదాకా మంత్రివర్గంలో నంబర్-2గా కొనసాగిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్కు ఈ దఫా కీలకమైన ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కలేదు. తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు, నితిన్ పటేల్ తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధపడుతున్నారు.
మూడు రోజుల్లోగా తనకు కేటాయించిన శాఖలను మార్చకపోతే రాజీనామా చేస్తానని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. నితిన్ ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. ఆయన తన శ్రేయోభిలాషులతో ఇంటివద్ద సమావేశమైనట్టు తెలిసింది. ఇది తమ నాయకుడి ఆత్మగౌరవ సమస్య అని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని నితిన్ సన్నిహిత వర్గీయులు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో తమ నాయకునికి అవమానం జరిగిందని భావిస్తున్న పాటిదార్లు సోమవారం ప్రధాని నరేంద్రమోదీ స్వస్థలమైన మెహసానా బంద్కు పిలుపునిచ్చారు. నితిన్ పటేల్ బీజేపీకి స్వస్తి చెప్పి తన వర్గం ఎమ్మెల్యేలతో వచ్చి (ప్రభుత్వ ఏర్పాటుకు) కాంగ్రెస్ మద్దతు కోరాలని పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ సూచించారు. ఈసారి ఆయనకు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, వైద్య విద్య శాఖలను అప్పగించారు.
శాఖలు మార్చిన రూపానీ.. కీలక శాఖలన్నీ సీఎం వద్దే
2016 ఆగస్టులో ఆనందిబెన్ పటేల్ రాజీనామా అనంతరం గుజరాత్ సీఎంగా రేసులో నితిన్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒకదశలో ఆయన పేరే ఖరారుచేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో విజయ్ రూపానీకి సీఎం పీఠం దక్కింది. కాగా, డిప్యూటీ హోదాతోపాటు ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలు దక్కడంతో నితిన్ మిన్నకుండిపోయారు. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నితిన్కు మరోసారి డిప్యూటీ పోస్టు లభించింది కానీ శాఖల్లో కోత పడింది. ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్ పటేల్కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు.
త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని బీజేపీ వర్గాల ఆశాభావం
శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయకున్నా, ఆయన అవమానభరంతో రగిలిపోతున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. పాత శాఖలను తిరిగి కేటాయిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని నితిన్ బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ కేబినెట్ చిచ్చు తారాస్థాయికి చేరడంతో శాఖ కేటాయింపుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నితిన్భాయ్ పటేల్ వ్యవహారం గుజరాత్లో కొత్త రాజకీయానికి తెరలేపింది. పటేళ్ల ఆత్మగౌరవ సమస్య అంశం తెరపైకి రావటంతో పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చేశారు.
గౌరవించని బీజేపీతో ఎందుకని పాస్ నేత పిలుపు
బీజేపీలో అంతర్గత గ్రూపు రాజకీయాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం నితిన్పటేల్కు హార్దిక్ పటేల్ బంపరాఫర్ ప్రకటించారు. ‘ఆయన(నితిన్) వెంటనే బీజేపీని వీడాలి. తన వెంట మరో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలి. అలా వస్తే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇప్పిస్తా' అని హామీ ఇస్తున్నారు. బీజేపీ గౌరవించని పక్షంలో ఇంకా పార్టీని పట్టుకుని వేలాడే అవసరం నితిన్కు ఏంటని హార్దిక్ ప్రశ్నిస్తున్నారు. సారంగపూర్లో మీడియాతో హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అహంకారులైన బీజేపీ నేతలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో సుపరిపాలన కోసం కలిసి పోరాడుదామని హార్దిక్ పటేల్ నితిన్పటేల్కు పిలుపునిచ్చారు. ఎంతో సీనియర్ నాయకుడు, 27 ఏండ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న నితిన్పటేల్కు బీజేపీ సముచిత స్థానం కల్పించడం లేదని, ఆయనను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని హార్దిక్పటేల్ ఆరోపించారు. బీజేపీ హైకమాండ్ తన మనోభావాలకు అనుగుణంగా స్పందించగలదని ఆశిస్తున్నట్టు నితిన్ పటేల్ పేర్కొన్నారు. ఇది శాఖలకు సంబంధించిన అంశం కాదని, తన ఆత్మగౌరవానికి సంబంధించినదని చెప్పారు.
శాఖలు మారినా నంబర్ టూ నితినేనన్న రూపానీ
మరో సీనియర్ నేత, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్కు ఫోన్ చేసి నితిన్ పటేల్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో తాను నిర్వహించిన శాఖలను తనకు కేటాయించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆనందీబెన్తో నితిన్ చెప్పినట్టు అనధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఎవరూ ధ్రువీకరించడం లేదు. మెహసానాకు చెందిన పలువురు పాటిదార్ నేతలు శనివారం నితిన్ నివాసానికి వెళ్లి తమ మద్దతు తెలిపారు. అనంతరం కిరీట్ పటేల్ అనే పాటిదార్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన నితిన్పటేల్కు అన్యాయం జరిగిందని, తామంతా ఆయనతోనే ఉన్నామని చెప్పారు. నితిన్ పటేల్ ఇప్పటికీ ప్రభుత్వంలో నంబర్-టూయేనని, శాఖలు మారినంత మాత్రాన ఆయనకున్న ప్రాధాన్యం మారదని సీఎం విజయ్ రూపానీ పేర్కొన్నారు.