భారత్లో కరోనాపై పోరుకు వైద్యసిబ్బంది కొరత.. శిక్షణ ఇవ్వాల్సింది కొండంత..!
న్యూఢిల్లీ : కరోనావైరస్ దేశంను వణికిస్తోంది. ఇప్పటికే దేశ రాజధానిలో ఆరుగురికి వైరస్ సోకినట్లు వార్తలు వస్తుండగా మరో ఏడు కేసులను పరీక్షలకు పంపడం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ లక్షణాలు కనిపించడం ఆ తర్వాత నిర్థారణ జరగడం జరిగింది. ఇక కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సరిపడా వైద్య సిబ్బంది లేరని సమాచారం. అంతేకాదు హాస్పిటల్స్, ల్యాబులు కొరత కూడా ఉంది.ఒక వేళ కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే ఇళ్లకే పరిమితం కావడం చాలా ఉత్తమమని చెబుతున్నారు వైద్యులు. అంతేకాదు దగ్గరలోని ఆస్పత్రికి వెంటనే వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
వైద్య సిబ్బంది కొరత
పట్టణ ప్రాంతాల్లో వైరస్ సోకితే ఇక్కడున్న సదుపాయాలతో వెంటనే గుర్తించడం జరుగుతుందని అదే గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలు లేకపోతే కరోనా వైరస్ వెంటనే వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా హాస్పిటల్స్ సంఖ్యను పెంచడం, పూర్తిస్థాయి వైద్యసిబ్బందిని నియమించడం వంటివి చేయాలని పలువురు హెల్త్ ఎక్స్పెర్ట్స్ చెబుతున్నారు. అంతేకాదు వార్డుల్లో ఐసొలేటెడ్ ఐసీయూలను ఏర్పాటు చేయాలని ఇందులో కనీసం 5శాతం మంది పేషెంట్లకు వెంటిలేటర్పై చికిత్స అందించే సదుపాయం ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ మరియు పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెబుతున్నారు.
ప్రతి 1457 మందికి ఒక డాక్టరు
కరోనా వైరస్ భారత్లోకి ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికిప్పుడు అన్నీ జరిగిపోవాలంటే కూడా సాధ్యం కాదంటున్నారు నిపుణులు. భారత్లో రిజిస్టర్ అయిన డాక్టర్ల సంఖ్య 1.1 మిలియన్లుగా ఉంది. ఇందులో 80శాతం మంది వైద్యం చేసేందుకు వచ్చినా ఆ సంఖ్య 9.26 లక్షలుగా ఉంటుందని ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విన్ కుమార్ చౌబే గతేడాది లోక్సభలో చెప్పారు. డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటానికి కూడా కారణం చెప్పారు మంత్రి. కొందరు రిటైర్ అవుతుండగా కొందరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి వెళుతున్నారని మరికొందరు విదేశాల్లో పనిచేసేందుకు వెళుతున్నారని చెప్పారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో ప్రతి 1,457 మందికి ఒక డాక్టరు ఉన్నట్లు చెప్పారు. ఈ నిష్పత్తి ప్రపంచ ఆరోగ్యం సంస్థ ప్రతిపాదించిన సంఖ్య కంటే తక్కువగా ఉందని చెబుతున్నారు.
Recommended Video
5శాతం మందికి ఐసీయూలో చికిత్స అందించాల్సిందే
ఇక డాక్టర్ల సంఖ్య అటుంచితే భారత్లో 2 మిలియన్ కంటే కాస్త ఎక్కువగా రిజిస్టర్ అయిన నర్సులు, మిడ్వైవ్స్లు ఉన్నారని చెబుతున్నారు. ఇందులో చాలామందికి కరోనావైరస్ను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇక కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి దాదాపుగా 20శాతం మందికి హాస్పిటల్ ఉంటే సరిపోతుందని, మరో 5శాతం మందికి మాత్రం కచ్చితంగా ఐసీయూ ఉండాల్సిందే అని ఎందుకంటే ఇది న్యూమోనియాకు దారి తీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిఫైడ్ డాక్టర్లు, నర్సులు చాలా తక్కువగా ఉంటారని మరో డాక్టర్ చెప్పారు.
అరకొరగా ఉన్న ల్యాబులు.. పెంచుతామన్న మంత్రి హర్షవర్ధన్
ప్రస్తుతం కోవిడ్-19 పరీక్షలు భారత్లోని 19 ల్యాబుల్లో జరుగుతున్నాయి. భారత్లో వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు మరో 19 ల్యాబులు అందుబాటులోకి తీసుకొస్తామని అదే సమయంలో ల్యాబ్స్ సంఖ్యను 50కి పెంచుతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఇది రెండు రోజుల సమయంలో జరుగుతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే గాలి నుంచి మనుషులకు సోకుతున్న ఈ అత్యంత ప్రమాదకరమైన కరోనావైరస్తో హెల్త్ వర్కర్లలో కూడా ఆందోళన నెలకొంటోంది. కరోనావైరస్ వచ్చిన వారంరోజుల్లోనే చైనా 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. కానీ మనదేశంలో అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇక్కడ కాస్త ఊరటనిచ్చే అంశమేంటంటే బయటపడ్డ కేసులన్నీ పెద్ద నగరాల్లోనే బయటపడ్డాయని అదే చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో కరోనావైరస్ కేసులు బయటపడి ఉంటే ప్రాణాలు కోల్పోయేవారని రామ్మనోహర్లోహియా హాస్పిటల్ డాక్టర్ ఒకరు చెప్పారు.