భారత్లోనే: భర్త దాడిలో గాయపడిన అఫ్ఘాన్ యువతి
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ దేశానికి చెందిన 18ఏళ్ల యువతి మనదేశంలోని న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త దాడికి పాల్పడటంతోపాటు కాల్చడంతో షకిలా జరీన్కు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో కోలుకుంటోంది. అయితే తాను తిరిగి తన స్వదేశానికి వెళ్లనని చెబుతోంది. తాను ఇక్కడే చదువుకుని స్థిరపడిపోతానని జరీన్ పేర్కొంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరీన్కు 17ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తమ బంధువైన 31ఏళ్ల వ్యక్తితో వివాహం చేశారు ఆమె కుటుంబసభ్యులు. దీంతో ఆమె ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ముగింపు పలకాల్సి వచ్చింది. అయితే ధైర్యంగా తన కుటుంబ సభ్యులు, భర్తను ఎదిరించిన జరీన్.. చదువుకోవాలని నిశ్చయించుకుంది. కానీ ఈ నిర్ణయం తన భర్తకు నచ్చకపోవడంతో గత డిసెంబరులో ఆమెపై దాడికి దిగాడు.
గాయాలపాలైన బాధితురాలు జరీన్ చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి చేరుకుంది. ఆమె బంధువులు అమెరికా సహాయం కోరినప్పటికీ.. మనదేశం వైద్య సహాయం అందించేందుకు ముందుకు రావడంతో ఇక్కడ చేరింది బాధితురాలు. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు 3 శస్త్రచికిత్సలు చేశారు వైద్యులు. ఆమె తొడకు సంబంధించిన ఛర్మాన్ని ముఖంపై అంటించారు.
ప్రస్తుతం కోలుకున్న జరీన్, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. బాధితురాలితోపాటు ఆమె తల్లి వెంట ఉంది. అయితే తిరిగి తమ దేశానికి వెళితే తనను భర్త చంపేస్తాడని భయాందోళనకు గురవుతోంది. దీంతో ఆమె ఇక్కడే స్థిరపడిపోతానని చెబుతోంది. అయితే భారత విదేశీ విధానాలు అందుకు అనుకూలంగా లేవు. జరీన్ విషయంలో భారత్, ప్రత్యేక చర్యలు చేపడితే ఆమె కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. కాగా, జరీన్ తన దేశానికి వెళితే ఆమెపై భర్త, భర్త తరపు బంధువులు దాడికి పాల్పడే అవకాశం ఉందని షకిలాకు ఆర్థిక సహాయం అందించిన అమెరికాలోని ప్రవాస అఫ్ఘాన్ అరిజో కోహిస్తానీ తెలిపారు.