‘కుక్కల్లా కాల్చిపారేయాలి’కామెంట్లపై పెనుదుమారం.. దిలీప్ ఘోష్ మెడకు కేసుల ఉచ్చు.. బీజేపీ సైలెంట్..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తోన్న ముస్లిం నిరసనకారుల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపారేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. మంగళవారం ఒక్కరోజే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. దిలీప్ వ్యాఖ్యల్ని సొంత పార్టీ బీజేపీ సైతం ఖండించిన నేపథ్యంలో మమత సర్కారు కూడా చర్యలకు ఉపక్రమించింది.
చంపేయాలి..
వెస్ట్ బెంగాల్ నదియా జిల్లా కేంద్రంలో ఆదివారం సీఏఏపై జరిగిన మీటింగ్ లో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ముస్లింల సంఖ్య బెంగాల్ లోనే ఎక్కువగా ఉందని, వాళ్లంతా సీఏఏపై నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని, అలాంటివాళ్లను గుర్తించి కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపారేయాలంటూ వివాదాస్ప కామెంట్లు చేశారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోతోపాటు బెంగాల్ కు చెందిన బీజేపీ నేతలంతా ఘోష్ వ్యాఖ్యల్ని ఖండించారు.
కుక్కల్లా వేటాడుతారేమో..
బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పై కేసు నమోదుకు సంబంధించి బెంగాల్ పౌరసరఫరాల మంత్రి, టీఎంసీ సీనియర్ నేత జ్యోతిప్రియో ముల్లిక్ ఘాటుగా స్పందించారు. దిలీప్ ఘోష్ అన్నంతపని చేస్తాడేమోనని రాష్ట్రంలో ముస్లింలు, సీఏఏ నిరసనకారులు భయంతో వణికిపోతున్నారని, బీజేపీ నేతలు కుక్కల్లాగా జనం వెంటపడకముందే కట్టడిచేయాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు.
బీజేపీ మౌనం..
సీఏఏ నిరసనకారుల్ని చంపాలని బెదిరించిన బెంగాల్ బీజేపీ చీఫ్ పై నమోదైన కేసుల్లో ఒకటి నదియా జిల్లాలో, ఇంకోటి నార్త్ 24 పరగణ జిల్లాలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఘోష్ పై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు. దిలీప్ ఘోష్ పై కేసుల వ్యవహారంలో బీజేపీ ఇప్పటిదాకా సైలెంట్ ఉండిపోయింది.