ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్పై దుండగుల కాల్పులు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుడి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జోష్లో ఉన్నారు అయితే మెహరౌలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నరేశ్ యాదవ్ కూడా జోష్లో ఉన్నారు. కార్యకర్తలతో కలిసి గుడిగా వెళ్లి వస్తోండగా.. ఆయన కాన్వాయ్పై కాల్పుల మోత మోగింది. దుండుగులు జరిపిన కాల్పుల్లో ఒక కార్యకర్త చనిపోయారు. ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉన్న ఆనందం కాల్పులతో ఆవిరైపోయింది.
ఆలయం నుంచి వస్తోండగా..
తన నియోజకవర్గంలో ఆలయంలో దర్శించుకొని నరేశ్ యాదవ్ తిరిగి వస్తున్నారు. వారి కాన్వాయ్ కిషన్ బాగ్ ప్రాంతానికి రాగానే దుండగులు కాల్పులు జరిపారు. 4 రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక కార్యకర్త చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. కాల్పుల ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఎవరూ దాడి చేశారో తనకు తెలియదని తెలిపారు. కాల్పులు జరిపిన సమయంలో తాను వాహనంలో ఉన్నానని.. ఘటనపై పోలీసులు సరిగ్గా విచారణ జరిపితే కాల్పులు జరిపిన వారిని పట్టుకొంటారని తెలిపారు. లేదంటే తప్పించుకొనే ప్రమాదం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు.
టార్గెట్ ఇద్దరు..
నరేష్ యాదవ్ కాన్వాయ్పై ఉన్న ఇద్దరు వ్యక్తుల లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. రెండు గ్రూపుల మధ్య గొడవ వల్లే కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు చెప్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారు ఇదివరకు మరో గ్రూపుపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో ఏడు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఆప్ జయభేరీ
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 62 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. గతంలో 3 స్థానాల నుంచి.. 8 సీట్లకు చేరింది. 2015 మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. ఆప్ ప్రభంజనం ముందు ఇతరులు.. ఇతర రాజకీయ పార్టీలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 67 మందికి డిపాజిట్ గల్లంతయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.