శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఏళ్లుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మహిళల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా.. ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పుడు అందుకు సానుకూలంగా స్పందించడం చూస్తూనే ఉన్నాం.
ఇదంతా ఇలా ఉంటే.. వయసుతో నిమిత్తం లేకుండా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం కల్పించాల్సిందేనని తాజాగా కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉన్న ఈ అంశంపై కోర్టు విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా కేరళ ప్రభుత్వం తన వాదనను వినిపించగా.. ఆలయంలోకి హిళల ప్రవేశానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
మహిళల్లో సహజంగా జరిగే రుతుస్రావం కారణంగా వారిని ఆలయ ప్రవేశానికి అనుమతించడం లేదనేది ఒక వాదనైతే.. అయ్యప్ప బ్రహ్మచారి గనుక యువతులకు అనుమతి లేదనేది మరో వాదన. దీనికి సంబంధించి ఆమధ్య శబరిమల దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రయార్ గోపాలక్రిష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళలు రుతుస్రావంలో ఉన్నారో లేరో తెలుసుకోవడానికి మెషీన్స్ వస్తే.. అప్పుడు వారి ఆలయ ప్రవేశానికి అనుమతిస్తామని అప్పట్లో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా, 2007లో అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని పట్టుబడింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సీన్ మారిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఎల్డీఎఫ్ అధికారంలోకి రావడంతో మహిళల ఆలయ ప్రవేశం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం మహిళల ఆలయ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.