రొటీన్ టెంపరేచర్ చెక్ కాదు... స్కూళ్ల రీఓపెనింగ్,వైరస్ కట్టడిపై ఐసీఎంఆర్ కీలక సూచనలు...
కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించి అరికట్టడానికి స్కూళ్లలో విద్యార్థులు,సిబ్బందికి తరుచూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సూచించింది. రొటీన్ టెంపరేచర్ చెక్తో పెద్దగా ఉపయోగం ఉండదని... దాన్ని పక్కనపెట్టాల్సిందేనని పేర్కొంది. దానికి బదులు స్కూల్లోనే కరోనా టెస్టులు చేయగలిగే సదుపాయాలను ఏర్పరుచుకోవాలని సూచించింది. స్థానికంగా కోవిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్థాయిని బట్టి స్కూళ్లను మూసివేయాల్సి రావొచ్చునని తెలిపింది.ఇటీవల ప్రచురితమైన ఐసీఎంఆర్ జర్నల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
'దశలవారీగా స్కూళ్లను రీఓపెన్ చేయాలి. స్కూళ్లను కోవిడ్ నుంచి సురక్షిత ప్రదేశాలుగా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 1-17ఏళ్ల వయసున్నవారిలో కోవిడ్ తీవ్రత చాలా తక్కువ.కోవిడ్ కారణంగా సంభవించే మరణాలు కూడా వారిలో తక్కువే.పెద్దలతో పోలిస్తే పిల్లల ద్వారా కరోనా వైరస్ అంతగా వ్యాప్తి చెందదు.వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ కీలకంగా ఉన్న నేపథ్యంలో... 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ఐసీఎంఆర్ ప్రాధాన్యతనిస్తుంది. 12 ఏళ్లు పైబడినవారిలో వ్యాక్సిన్ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందునా వారికి వ్యాక్సిన్ విషయంలో ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది.' అని ఐసీఎంఆర్ పేర్కొంది.
స్కూళ్ల రీఓపెనింగ్కి సంబంధించి గ్లోబల్ డేటాను ప్రస్తావించిన ఐసీఎంఆర్ జర్నల్... మొదట చిన్న పిల్లలకు స్కూళ్లు రీఓపెన్ చేయడం ద్వారా ఆర్ వాల్యూ( ఇన్ఫెక్షన్ సోకినవారి నుంచి ఇతరులకు ఎంతమేర వ్యాప్తి చెందుతుందో తెలిపే సూచీ) పెద్దగా పెరిగే అవకాశం లేదని పేర్కొంది.అదే సెకండరీ స్కూల్స్ రీఓపెన్ చేయడం ద్వారా యూకెలో ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలిపింది. పెద్ద పిల్లల్లో వారి కుటుంబ సభ్యుల నుంచి వారికి వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
గతంలో ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ స్కూళ్ల రీఓపెనింగ్కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట సెకండరీ స్కూళ్ల కంటే ప్రైమరీ స్కూళ్లు తెరవాలని సూచించారు.
స్కూళ్లలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఐసీఎంఆర్ పలు సూచనలు చేసింది. భౌతికదూరం పాటించడం,ఆల్టర్నేట్ డే స్కూల్స్,వెంటిలేషన్ బాగా ఉండేలా చూడటం,హాల్ రూమ్స్ లేదా ఓపెన్ గార్డెన్ ఏరియాలో క్లాసులు నిర్వహించడం మంచిదని పేర్కొంది.
యునెస్కో నివేదిక ప్రకారం భారత్లో కోవిడ్ కారణంగా స్కూళ్లు మూతపడటంతో 320 మిలియన్ల మంది చిన్నారులపై ప్రభావం పడినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మరో సర్వేలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 8 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో కేవలం 24శాతం మంది రెగ్యులర్గా ఆన్లైన్,ఆఫ్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపింది.దేశంలోని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల రీడింగ్ ఎబిలిటీస్ పడిపోయాయని చెబుతున్నట్లు పేర్కొంది.