బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్రమనిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతారని అందరికీ తెలిసింది. అలాగే. నేరస్తులు, హంతకులను అణిచివేసేందుకు కూడా ఆయన బుల్డోజర్లతో ఉపయోగిస్తుంటారు. తాజాగా, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసిన సొంతపార్టీ నేత ఇంటిపైకీ బుల్డోజర్ పంపించారు యోగి.
ఆ వివరాల్లోకి వెళితే.. బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన నేత శ్రీకాంత్ త్యాగి నోయిడాలోని గ్రాండ్ ఒమాక్సే సొసైటీలో నివాసం ఉంటున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదే సొసైటీలో ఉండే ఓ మహిళతో గొడవ జరిగింది. త్యాగి కొన్ని మొక్కలు నాటడానికి ప్రయత్నించగా.. అది నిబంధనలకు విరుద్ధమని ఆ మహిళ వాదించింది. ఇక్కడ నాటేందుకు తనకు హక్కు ఉందంటూ ఆయన దరుసుగా ప్రవర్తించారు. ఆమెను దుర్భాషలాడి, దాడికి పాల్పడిన దృశ్యాలు వైరల్గా మారాయి.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తాను బీజేపీ కిసాన్ మోర్చా సభ్యుడినని చెప్పుకోవడంతో పాటు సీనియర్ నేతలతో ఉన్న ఫొటోలను పోస్టు చేశారు. కానీ, పార్టీ మాత్రం ఆయనకు దూరం పాటించింది. ఆయన ప్రకటనలను తోసిపుచ్చింది. ఈ వివాదాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చర్యలకు ఉపక్రమించింది. సోమవారం పోలీసులు, అధికారులు.. త్యాగి ఇంటికి చెందిన అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టారు. అలాగే ఆయన మద్దతుదారులను అరెస్టు చేశారు. దీనిపై ఢిల్లీకి చెందిన బీజేపీ ప్రతినిధి కేమ్చంద్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. దురుసుగా వ్యవహరించిన త్యాగిపై చర్యలు తీసుకున్నందుకు యోగికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా, ఈ ఘటన తర్వాత నుంచి త్యాగి పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.25 వేలు రివార్డు అందించనున్నట్లు నోయిడా పోలీసులు ప్రకటించారు. ఆయన ఫోన్ సిగ్నల్ చివరగా ఉత్తరాఖండ్లో గుర్తించినట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.