కీలక సమయంలో సభకు రానీ సీఎం, కొత్త సీఎంగా జెలియాంగ్
నాగాలాండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా జెలియాంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. జెలియాంగ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ పీబీ ఆచార్య నిర్ణయం తీసుకున్నారు.
కోహిమా: నాగాలాండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా జెలియాంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. జెలియాంగ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ పీబీ ఆచార్య నిర్ణయం తీసుకున్నారు.
శాసనసభలో బలపరీక్షకు సీఎం లీజిత్సు హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్ను గవర్నర్ ఆచార్య ఆహ్వానించారు.
బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని జెలియాంగ్ను కోరారు. జులై 22లోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేశారు.
నాగాలాండ్లో మాజీ సీఎం జెలియాంగ్ ఎదురు తిరగడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. మొత్తం 47 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తనకే మద్దతిస్తున్నారని, తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరుతూ జెలియాంగ్ గవర్నర్కు లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో జులై 15 లోపు అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆచార్య ప్రస్తుత సీఎం లీజిత్సుకు సూచించారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన లీజిత్సు ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన గౌహతి కోహిమా బెంచ్ న్యాయస్థానం గవర్నర్ ఆదేశాలపై జులై 17 వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జులై 18న మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో బలపరీక్షకు సిద్ధమవ్వాలని గవర్నర్ మరోసారి సూచించారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే ఈ సమావేశానికి లీజిత్సు గానీ, ఆయన మద్దతుదారులు గానీ హాజరుకాలేదు. ఫోన్లో కూడా కలవలేదు. దీంతో శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎంగా జెలియాంగ్ను ప్రకటిస్తూ.. గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.