ఎస్ఐఏఎం రిపోర్ట్ : భారత ఆటోమొబైల్ రంగంపై కరోనా దెబ్బ.. సేల్స్ ఎంతలా పడిపోయాయంటే?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ దేశంలో వస్తు,సేవల ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ కారణంగా చాలా యూనిట్లలో ఉత్పత్తులు నిలిచిపోయాయి. లాక్ డౌన్ అనంతరం మార్కెట్లో కొనుగోళ్లు పుంజుకోవడం కూడా అనుమానమే. కాబట్టి ఉత్పత్తి గణనీయంగా పడిపోయి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చు. మార్కెట్లో డిమాండ్ లేని కారణంగా సప్లై తగ్గిస్తే చాలా ఉద్యోగాలకు కోత తప్పదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ఆందోళన కలగకమానదు.
ఎస్ఐఏఎం రిపోర్ట్ ఏం చెబుతోంది..
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(SIAM) డేటా ప్రకారం దేశంలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ విక్రయాలు మార్చి నెలలో 51శాతం మేర పడిపోయాయి. గతేడాది ఇదే కాలానికి 2,91,861 యూనిట్ల విక్రయాలు జరగ్గా..ఈ ఏడాది కేవలం 1,43,014 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఫిబ్రవరిలోనూ డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ విక్రయాలు 7.61శాతం మేర పడిపోయినట్టు SIAM డేటా వెల్లడించింది.
పడిపోయిన చిన్న,మధ్య తరహా,భారీ వాహనాల విక్రయాలు...
ఇక చిన్న,మధ్య తరహా,భారీ వాహనాల విక్రయాల్లోనూ భారీ క్షీణత నమోదైనట్టు SIAM తెలిపింది. మార్చి నెలలో వీటి విక్రయాలు 88.05శాతం మేర పడిపోయాయి. గతేడాది 2019 మార్చి నెలలో 109,022 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది కేవలం 13,027 యూనిట్ల విక్రయం మాత్రమే జరిగింది. ఇక త్రీ వీలర్ సేల్స్ 58.34శాతం పడిపోయాయి. గతేడాది మార్చిలో 66,274 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది కేవలం 27,608 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. టూవీలర్స్ విషయానికొస్తే.. 39.83శాతం మేర పడిపోయి కేవలం 8,66,849 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. గతేడాది మార్చి నెలలో టూవీలర్స్ విక్రయాలు 14,40,593 కావడం గమనార్హం.
పూర్తి డేటా...
అన్ని రకాల డొమెస్టిక్,కమర్షియల్ వెహికల్స్ ఉత్పత్తిని పరిశీలిస్తే.. 2019 మార్చిలో 2,180,203 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. 2020,మార్చిలో 33.61 శాతం తగ్గి 1,447,345కు చేరుకుంది. వార్షిక విక్రయాలను గమనిస్తే.. ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు 2019 ఏప్రిల్-మార్చిలో 3,377,389 యూనిట్లతో పోలిస్తే 17.82 శాతం మేర తగ్గి 2019 ఏప్రిల్ - మార్చి 2020లో 2,775,679 యూనిట్లకు పడిపోయాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు ఏప్రిల్లో 717,688 యూనిట్లుగా ఉన్నాయి. -మార్చ్ 2020, ఏప్రిల్-మార్చి 2019 లో 1,007,311 యూనిట్లతో పోలిస్తే, ఇది 28.75 శాతం క్షీణించింది. కమర్షియల్ వెహికల్ సేల్స్ ఏప్రిల్-మార్చి 2019లో 1,007,311 యూనిట్లు కాగా.. ఏప్రిల్-మార్చి 2020లో 28.75శాతం మేర 717,688 యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. మార్చి-2020లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ దారుణమైన క్షీణతను చవిచూసిందని...తగ్గిన డిమాండ్,వినియోగదారుల సెంటిమెంట్,దానికి తోడు కరోనా వైరస్ కారణంగా విక్రయాలు పడిపోయాయని ఎస్ఐఏఎం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.