బిల్లుపై నిర్ధారణ: చాకుతో సభకి మోదుగుల, బహిష్కరణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ ముసాయిదా బిల్లు)ను లోకసభలో ప్రవేశ పెట్టినట్లు కేంద్రమంత్రి కపిల్ సిబాల్ గురువారం చెప్పారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును సభలో ప్రవేశ పెట్టిన సమయంలో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. సభలో బిల్లు టెబుల్ అయినట్లేనా అనే సందిగ్ధత పలువురిలో కనిపించింది. ఈ నేపథ్యంలో లోకసభలో బిల్లు టేబుల్ అయిందని కపిల్ సిబాల్, ఇతర అధికారులు స్పష్టం చేశారు. సభలో బిల్లును ప్రవేశ పెట్టామని షిండే కూడా చెప్పారు. ఇరు సభలు రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సభకు చాకుతో వచ్చినట్లుగా స్పీకర్ కార్యాలయం నిర్ధారించింది. లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లారు. దీంతో వారిద్దరిని సభ నుండి సస్పెండ్ చేసే యోచనలో స్పీకర్ కార్యాలయం ఉంది.
సభలో దారుణానికి పాల్పడిన ఎంపీలను సస్పెండ్ చేయాలని తాము సభాపతి మీరా కుమార్ను కోరుతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ చెప్పారు. ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరమని కమల్ నాథ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటన దురదృష్టకరమని సోమనాథ్ ఛటర్జీ అన్నారు.
కాగా, రాజ్యసభలో సిఎం రమేష్ చైర్ పర్సన్ మైకును విరగ్గొట్టారు. లోకసభలో అంతకుముందు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోకసభ ప్రధాన కార్యదర్శి మైకును విరగ్గొట్టారు.