బిపాసా బసుతో కలిసి యోగా చేసిన ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బాలీవుడ్ నటి, ఫిట్నెస్ నిపుణురాలు బిపాషా బసు, తదితరులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని కంటీర్వ స్టేడియంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 7గంటల నుంచి 8.30 వరకు సాగింది.
కేంద్రమంత్రి అనంత్ కుమార్ తోపాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తాను ఏడాది నుంచి యోగా చేస్తున్నట్లు తెలిపారు. యోగాతో తనలో కొంత మార్పు కనిపించిందని చెప్పారు.
పాఠశాలలు, కళాశాలల్లో యోగాను అదనపు పాఠ్యాంశంగా తప్పనిసరి చేస్తామని హామి ఇచ్చారు. యోగా చేయడం వల్ల ఒత్తిడి అధిగమించవచ్చని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాగా, గత సంవత్సరం సిద్ధరామయ్య బాలీవుడ్ నటి శిల్పాశెట్టితోపాటు యోగాసనాలు వేశారు.
ఇది ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ ఛండీగఢ్లో జరిగిన భారీ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాను అలవాటుగా మార్చుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు.