ఢిల్లీ చేరిన కాంగ్రెస్ పంచాయితీ, రాహుల్ గాంధీతో చర్చలు, అందరూ సీనియర్లు, మంత్రులు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని 87 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే విషయంపై రాహుల్ గాంధీతో చర్చించడానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి పదవుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. అందరూ సీనియర్లు కావడంతో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అని తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ పదవులు
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు సీఎం పదవితో పాటు 12 మంత్రి పదవులు తీసుకోవాలని ఇప్పటికే నాయకులు నిర్ణయించారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే విషయంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించడానికి సిద్దరామయ్య, పరమేశ్వర్ ఢిల్లీ వెళ్లారు.
అందరూ సీనియర్లు
కాంగ్రెస్ పార్టీలో చాల మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే 22 మంది మాత్రమే మంత్రులు అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్బంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.
డీకే శివకుమార్, వీరశైవ
ఉప ముఖ్యమంత్రి పదవి రాలేదని ఇప్పటికే డీకే. శివకుమార్ అసహనంతో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సీనియర్ ఎమ్మెల్యే, వీరశైవ మహాసభ అధ్యక్షుడు శామనూరు శివశంకరప్ప సైతం కీలకపదవి ఆశీస్తున్నారని సమాచారం.
మొదటికే మోసం
ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయో అంటూ ఎమ్మెల్యేలు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. మంత్రి పదవులు రాని వారు గ్రూప్ గా ఏర్పడి బీజేపీకి మద్దతు ఇస్తే మొదటికే మోసం వస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. మంత్రి పదవుల పంపకం కులాలా వారిగా విభజించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
రాహుల్ గాంధీ
మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి అనే విషయం రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని తెలిసింది. సీనియారిటీ, పనితనం చూసి మంత్రి పదవులు పంచిపెడుతారని సమాచారం. మంత్రి పదవులతో పాటు ఇటీవల పరమేశ్వర్ రాజీనామా చేసిన కేపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.