ఐఏఎస్ డీకే రవి కేసు: సాధ్యం కాదని సీబీఐ
బెంగళూరు: వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డీకే రవి కేసు దర్యాప్తులో షరతులు విదించడం సరికాదని సీబీఐ అధికారులు పెద్ద బాంబు పేల్చారు. మీరు చెప్పిన మూడు నెలల్లో కేసు దర్యాప్తు పూర్తి చెయ్యడం సాధ్యం కాదని సోమవారం సిద్దరామయ్య ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
ఐఎస్ అధికారి డీకే రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేసు దర్యాప్తు మూడు నెలలలో పూర్తి చెయ్యాలని సిద్దరామయ్య షరతులు విదిస్తూ కేంద్ర హోం శాఖ అధికారులకు ఉత్తరం రాశారు.
కేంద్ర హోంశాఖ అధికారులు కేసు దర్యాప్తు చెయ్యాలని చెన్నై సీబీఐ అధికారులకు సూచించారు. ఈ తతంగం జరగడానికి, అధికారికంగా లేఖలు అందడానికి కొన్ని రోజులు గడిచింది. బెంగళూరు చేరుకున్న సీబీఐ అధికారులు కేసు విచారణ చేస్తున్నారు.
అయితే కేసు వివరాలు తెలుసుకున్న సీబీఐ అధికారులు మూడు నెలలలో విచారణ చేయడం సాధ్యం కాదని అంటున్నారు. ఐఏఎస్ అధికారి రవి కేసులో అధికారులతో పాటు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, రవి కుటుంబ సభ్యులను విచారణ చెయ్యవలసి ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మూడు నెలలలో అందరినీ విచారణ చేసి నివేదిక తయారు చెయ్యడం కష్టమని తేల్చి చెబుతున్నారు. ఇదే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. హడావిడిగా కేసు దర్యాప్తు పూర్తి చెయ్యలేమని సీబీఐ అధికారులు అంటున్నారు. రవి కేసు దర్యాప్తులో మీకు ఎలాంటి షరతులు ఉండవని రెండు రోజులలో సీబీఐ అధికారులకు కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ఆదేశాలు జారీ కావచ్చని తెలిసింది.