కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్:సీఎల్పీ పదవీకి సిద్దరామయ్య, దినేశ్ గుండురావు కూడా
కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ జయభేరి మోగించింది. 12 సీట్లు గెలుచుకొని మెజార్టీ మార్కుకు దాటింది. రెండు సీట్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ నేతలు రాజీనామా బాటపడుతున్నారు.
సీఎల్పీ పదవీకి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను అధినేత్రి సోనియాగాంధీకి పంపించానని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహాజమని, ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు. సిద్ధరామయ్యతోపాటు దినేశ్ గుండురావు కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. దినేశ్ ప్రస్తుతం కర్ణాటక పీసీసీ చీఫ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కేపీసీసీ చీఫ్ పదవీకి దినేశ్ గుండురావు కూడా రాజీనామా చేశారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నేత డీకే శివకుమార్ కూడా స్పందించారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఫిరాయింపుదారులకే మద్దతిచ్చారని పేర్కొన్నారు. దానిని ఆమోదిస్తున్నామని శివకుమార్ తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతో తాము నిరుత్సాప పడటం లేదన్నారు. 12 సీట్లతో బీజేపీ 117కి చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 మ్యాజిక్ ఫిగర్ కాగా.. మరో నలుగురు సభ్యులు ఎక్కువగానే బీజేపీ గెలుచుకుంది.