తాజ్ హోటల్లో సిద్ధరామయ్య వ్యూహరచన, 'హైదరాబాద్ వచ్చాక అదుపులో పరిస్థితి'
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చారు. తాజ్ కృష్ణలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు. బెంగళూరు నుంచి విమానంలో బయలుదేరిన సిద్ధూ, గులాం నబీ ఆజాద్, ఆరుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు వెళ్లారు. అక్కడ బస చేసిన ఎమ్మెల్యేలతో కలిశారు. మరోవైపు, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా తాజ్ కృష్ణాకు చేరుకున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి అవకాశమివ్వడం అప్రజాస్వామికమని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి కుంతియా మండిపడ్డారు. తగినంత మెజార్టీ లేని బీజేపీకి ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఓ లేఖ రాశామన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్-జేడీఎస్ ఉండాలి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, మెజారిటీ లేని బీజేపీకి అధికారమివ్వడం అప్రజాస్వామికమన్నారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం చేపట్టడం ప్రజాస్వామ్యపరంగా సరైనదన్నారు.
కాంగ్రెస్ వ్యూహరచన
రేపు సాయంత్రం నాలుగు గంటలకు బలనిరూపణ నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తోన్న హోటల్ వద్దకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, వి హనుమంత రావు తదితరులు తాజ్కు వెళ్లారు. తమ పార్టీ అధిష్ఠానం వ్యూహాలను ఆ ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ రోజు రాత్రి లేదు రేపు ఉదయం ఎమ్మెల్యేలు బెంగళూరు బయలుదేరనున్నారు.
హైదరాబాద్ చేరుకోవడంతో పరిస్థితి అదుపులో
హైదరాబాద్కు చేరుకోవడంతో పరిస్థితి అంతా అదుపులోనే ఉన్నట్టు కేపీసీసీ అధ్యక్షులు పరమేశ్వరన్ అంతకుముందు చెప్పారు. ఈ బల నిరూపణలో యడ్యూరప్ప ఓడిపోక తప్పదన్నారు. జేడీఎస్తో కలిసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. జేడీఎస్ సమన్వయంతో బలపరీక్షలో ఎలాంటి పాత్ర పోషించాలని, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు. అలాగే, నోవాటెల్లో బస చేస్తోన్న జేడీఎస్ ఎమ్మెల్యేల వద్దకు ఆ పార్టీ నేత రేవణ్ణ చేరుకున్నారు. బల పరీక్ష సమయంలో సభ్యులు అనుసరించాల్సిన దానిపై చర్చిస్తున్నారు.
కాంగ్రెస్ అనుమానాలు
రేపటి విశ్వాస పరీక్షపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బలాబలాలపై ఇరు పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 15న వెల్లడైన ఫలితాల్లో మొత్తం 222 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా 104 బీజేపీ, 78 కాంగ్రెస్, 38 జేడీఎస్ కూటమికి గెలిచింది. మ్యాజిక్ ఫిగర్కు ఇంకా ఎనిమిది మంది సభ్యుల అవసరం ఉండటంతో బీజేపీ.. కాంగ్రెస్, జేడీఎస్లోని అసంతృప్తులను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది.