"ఆయనో తల తిక్క సీఎం.." : యడ్యూరప్ప కామెంట్
బెళగావి : కర్ణాటక సీఎం సిద్దరామయ్యను 'తలతిక్క మనిషి'గా అభివర్ణించారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప. సోమవారం బెళగావిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు వాస్తవాలేంటో సిద్దరామయ్యకు తెలిసి ఉండి కూడా తనపై లేని పోని నిందారోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తానంటే గిట్టనివారే ఉద్దేశపూర్వకంగా తనపై కుట్రపన్ని జైలు శిక్ష పడేలా చేశారని, కోర్టులు కూడా ఆరోపణలనే నిజాలుగా నిర్ధారించాయన్నారు. తనపై జరిగిన రాజకీయ కుట్ర వల్లే 24 రోజులు జైళ్లో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజా నిజాలేంటో తెలిసి కూడా సీఎం సిద్దరామయ్య తరచూ తనను జైలుకు వెళ్లి వచ్చావంటూ విమర్శించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎవరిని పంపించాలనే దానిపై ఇప్పటివరకు చర్చింలేదని, కేంద్రం నుంచి కూడా తమకు ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు లేవని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
ఇకపోతే, జనంలో రోజురోజుకు తన పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేకే సిద్దరామయ్య ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కర్ణాటకలో సిద్దరామయ్యే కాంగ్రెస్ పార్టీకి చివరి సీఎం అని మరోసారి జోస్యం చెప్పిన యడ్యూరప్ప, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ప్రజలు ఖంగు తినిపించడం ఖాయమన్నారు.