సిద్దరామయ్య ఎస్ అంటే 2 నిమిషాల్లో సంకీర్ణ ప్రభుత్వం పతనం: కాంగ్రెస్ ఎమ్మెల్యే, హాయిగా !
బెంగళూరు: కర్ణాటక మాజీ మఖ్యమంత్రి సిద్దరామయ్య మనసు పెట్టి ఎస్ అంటే 2 నిమిషాల్లో సంకీర్ణ ప్రభుత్వం పతనం అవుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని బీదర్ జిల్లా బసవకల్యాణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నారాయణ జోస్యం చెప్పారు. శనివారం ఆయన బీదర్ లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ హైకామండ్ సిద్దరామయ్యను పక్కన పెట్టిందని, పార్టీలో ఆయన మాటకు విలువలేదని వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి. నారాయణ అన్నారు. సిద్దరామయ్యను పార్టీ పట్టించుకోవడం లేదని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నారాయణ చెప్పారు.
సిద్దరామయ్యను సైడ్ లైన్ చెయ్యాలని హైకాండ్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేతగా ఎలా నియమిస్తుంది అని ఎమ్మెల్యే బి. నారాయణ మీడియాను ప్రశ్నించారు. సిద్దరామయ్య ఎప్పటికి మా నాయకుడే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి. నారాయణ అన్నారు.
అనవసరం అయిన పుకార్లతో సిద్దరామయ్యను మానసికంగా హింసించరాదని ఎమ్మెల్యే బి. నారాయణ మీడియా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేశారు. మంత్రివర్గం ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరిగిపోయి రోజురోజుకు తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంఖ్య పెరిగిపోతుంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం హాయిగా బాదామి నియోజక వర్గంలో పర్యటిస్తూ తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.