సదానంద మార్పుపై సీఎం సిద్ధరామయ్య సంచలనం
బెంగుళూరు: ఎన్టీఏ ప్రభుత్వంలోని బీజేపీ నేతలంతా అసమర్ధులేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ వర్థంతి సందర్భంగా బుధవారం విధానసౌధ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి నివాహళులర్పించారు.
అనంతరం కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కర్ణాటకకు చెందిన సదానందగౌడకు ప్రాధాన్యం లేని శాఖను కేటాయించడంపై ఆయన స్పందించారు. 'సదానందగౌడ అసమర్థత కారణంగానే న్యాయశాఖ వంటి ప్రధానమైన శాఖ నుంచి ఆయనకు ప్రధాన్యం లేని 'స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్' శాఖకు మార్చారని ఆయన ఎద్దేవా చేశారు.
మోడీ మంత్రివర్గం పూర్తి జాబితా: ఎవరెవరికి ఏయే శాఖఒక్క సదానంద మాత్రమే కాదు ఎన్టీఏ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులంతా అసమర్ధలుగానే తయారయ్యారని ఆయన విమర్శించారు. మరోవైపు మైసూరు డిప్యూటీ కమిషనర్ శిఖాను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
'తనను కొంతమంది వ్యక్తులు బెదిరించిన విషయంపై డిప్యూటీ కమిషనర్ శిఖా ఇప్పటికే కేసు దాఖలు చేశారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం' అని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
డిప్యూటీ కమిషనర్ శిఖాను బెదిరించిన వారిలో సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన మైసూరు జిల్లా పంచాయితీ ప్రెసిడెంట్ మారి గౌడ ఉన్నారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ విషయం సిద్ధరామయ్యకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ విషయంలో ప్రతిపక్షాలు సైతం సీఎం సిద్ధరామయ్య తీరుని తప్పుబడుతున్నాయి. మరోవైపు శాసనమండలి స్పీకర్ ఎంపిక విషయమై ఇప్పటి వరకు జేడీఎస్తో చర్చించలేదని సిద్ధరామయ్య వెల్లడించారు. శాసనమండలిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో సదానంద గౌడకు ప్రాధాన్యత లేని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు మార్చిన సంగతి తెలిసిందే. సదానంద పనితీరు పట్ల మోడీ అంత సంతృప్తిగా లేకపోవడం, ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన అంశంపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు అలజడి రేపడం ఆయన శాఖ మార్పునకు కారణంగా భావిస్తున్నారు.