మంత్రి పదవులు రాలేదని తిరుగుబాటు: బీజేపీ వైపు చూపు: సిద్దరామయ్య క్లారిటీ, నిజం కాదు!
బెంగళూరు: జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు రాలేదని ఎమ్మెల్యేలలో ఎలాంటి అసంతృప్తి లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మంత్రి పదవులు రాలేదని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకత్వంపై ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు పూర్తి నమ్మకం ఉందని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
అధ్యక్షుడిగా సిద్దూ
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను నియమించారు. సమన్వయ కమిటీ సభ్యులుగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, జేడీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డానిశ్ ఆలీ తో పాటు ఇతరులు ఉంటారు. సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా తనను నియమించిన హైకమాండ్ కు మాజీ సీఎం సిద్దరామయ్య కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వానికి సలహాలు
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సిద్దరామయ్య నేతృత్వంలోని సమన్వయ కమిటీ సూచనలు, సలహాలు ఇస్తుంది. నెలకు ఒక సారి సమన్వయ కమిటీ భేటీ అయ్యి సంకీర్ణ ప్రభుత్వం తీరు, ప్రజల సమస్యలు, చెయ్యవలసిన పనుల విషయంలో చర్చించి సలహాలు, సూచనలు ఇస్తుంది..
ఎమ్మెల్యేల అసమ్మతి
కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి సిద్దంగా ఉన్నాయని సిద్దరామయ్య అన్నారు. ఇరు పార్టీలు కలిసి కర్ణాటక ప్రజలకు సేవ చెయ్యడానికి సిద్దంగా ఉన్నాయని, రెండు పార్టీల ఎమ్మెల్యేలలో ఎలాంటి అసమ్మతి లేదని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
రెండు పార్టీల హామీలు
శాసన సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను సమన్వయ కమిటీలో చర్చించి వాటిలోని ముఖ్య అంశాలు అమలు చెయ్యడానికి చర్యలు తీసుకుంటామని సిద్దరామయ్య అన్నారు. రెండు పార్టీల మేనిఫెస్టోలోని హామీలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
జేడీఎస్ నెగ్గలేదు
కీలకమైన మంత్రి పదవులు జేడీఎస్ తీసుకుందని, కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవుల పంపిణి విషయంలో వెనక్కి తగ్గిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సిద్దరామయ్య అన్నారు. ఇరు పార్టీల నాయకులు కుర్చుని చర్చించి అందరి ఆమోదంతో మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
బీజేపీ వైవు చూపు
మంత్రి పదవులు రాలేదని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేల్లో ఎలాంటి అసంతృప్తి లేదని, సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేవని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.