జేడీఎస్ వదిలి రాలేదు, మాజీ ప్రధాని పంపించేశారు, మాజీ సీఎం క్లారిటీ, బీజేపీకి సిగ్గులేదు !
బెంగళూరు: జేడీఎస్ పార్టీని వదిలి తాను బయటకురాలేదని, అహింద కార్యకలాపాలు చేపట్టినందుకు తనను మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ పార్టీ నుంచి బయటకు పంపించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు అన్నీ అపద్దాలు చెబుతున్నారని సిద్దరామయ్య ఆరోపించారు.
బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ చేసిన ఆరోపణలపై సిదదరామయ్య మండిపడ్డారు. డాక్టర్ ఉమేష్ జాదవ్ కు కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే పార్టీకి ద్రోహం చేసిన డాక్టర్ ఉమేష్ జాదవ్ బీజేపీలో చేరారని సిద్దరామయ్య ఆరోపించారు.
ఉప ఎన్నికల తరువాత 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమీ కావాలంటే అది చేస్తారని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప అన్న మాటలపై సిద్దరామయ్య మండిపడ్డారు. బీజేపీ నాయకులకు మతిచెడిపోయి ఏమంటే అది మాట్లాడుతున్నారని సిద్దరామయ్య ఎద్దేవ చేశారు.
బీజేపీ నాయకులకు అధికార దాహం పట్టుకుందని, నగదు ఎర చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. బీజేపీ నాయకులు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లొంగిపోరని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి బీజేపీకి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, యడ్యూరప్ప సమాధానం చెప్పాలని సిద్దరామయ్య డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగరని సిద్దరామయ్య అన్నారు.
యడ్యూరప్పకు గవర్నర్ ఒక్కసారి అవకాశం ఇచ్చారని, శాసన సభలో మెజారిటీ నిరూపించుకోలేని ఆయన మూడు రోజులకే ఇంటికి వెళ్లిపోయారని, అయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని సిద్దరామయ్య విమర్శించారు. బీజేపీ కలలో కూడా అధికారంలోకి రాదని, ఇది సత్యమని సిద్దరామయ్య అన్నారు.