జగన్ ను అనుసరిస్తోన్న బీజేపీ..టీడీపీని ఫాలో అవుతున్న కాంగ్రెస్: ఎందుకు?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వాన్ని కూలదోసి మరీ గద్దెనెక్కిన భారతీయ జనతాపార్టీ.. పరిపాలనలో అచ్చంగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి, విధానాలను అనుసరిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో నెట్టటానికి, ఆత్మరక్షణలో పడేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను తానూ అమలు చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. మన రాష్ట్రంలో అయిదుమంది ఉప ముఖ్యమంత్రులను నియమించారు వైఎస్ జగన్. అదే ఫార్ములాను తానూ ఫాలో అయ్యారు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. తన కేబినెట్ లో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులకు చోటిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్లను మూసివేసింది ప్రభుత్వం.
అన్న క్యాంటీన్ల బాటలో ఇందిర క్యాంటీన్లు..
ఇప్పుడు అదే నిర్ణయాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు యడియూరప్ప. కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన ఇందిర క్యాంటీన్లను మూసివేయాలని ఆదేశించారు. ఇది బెంగళూరు వరకే పరిమితమా? లేక రాష్ట్రంలో ఉన్న ఇందిరా క్యాంటీన్లన్నింటినీ మూసివేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది.. అచ్చంగా తెలుగుదేశం పార్టీ తరహాలోనే. అయిదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే ఇందిరా క్యాంటీన్లను మూసేయడాన్ని సహించబోమంటూ హెచ్చరిస్తోంది. నిరసన కార్యక్రమాలకు తెర తీస్తోంది. బెంగళూరులో ఆందోళనలను చేపట్టాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. మిత్రపక్షం జనతాదళ్ (ఎస్) సహకారాన్ని కూడా తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
Recommended Video
బడ్జెట్ లేదనే కారణమేనా?
బెంగళూరులో 173 ఇందిర క్యాంటీన్లు ఉన్నాయి. మరో 18 మొబైల్ క్యాంటీన్లు దీనికి అదనం. 2016లో వాటిని ఏర్పాటు చేశారు. అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ క్యాంటీన్లను ప్రారంభించారు. ఒక్క బెంగళూరులోనే రోజూ సుమారు మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఇందిర క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారని ఓ అంచనా. వాటి నిర్వహణ మొత్తం బృహత్ బెంగళూరు నగర పాలికె (బీబీఎంపీ) చేతుల్లో కొనసాగుతోంది. ఇందిర క్యాంటీన్ల నిర్వహణ భారమైందని, బడ్జెట్ చేతులు దాటిపోతోందంటూ తాజాగా బీబీఎంపీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మంగళవారం ఏర్పాటైన బీబీఎంపీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఇందిర క్యాంటీన్ల నిర్వహణకు బీబీఎంపీ 50 శాతం, ప్రభుత్వం మరో 50 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వాటా అందట్లేదని బీబీఎంపీ కమిషనర్ బీహెచ్ అనిల్ కుమార్ వెల్లడించారు.
అవినీతి పేరుతో మూసివేత..
ఇందిర క్యాంటీన్ల నిర్మాణాల పేరుతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిధులను మెక్కేశారనేది అధికార బీజేపీ పెద్దలు చేస్తోన్న ఆరోపణ. దీనిపై విచారణ చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ నాయకుల అవినీతిని బట్టబయలు చేయడానికి తాత్కాలికంగా ఇందిర క్యాంటీన్లు మూసివేయనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. క్యాంటీన్ల నిర్మాణం, నిర్వహణ విషయాల్లో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు గుర్తించడం వల్ల తాము వాటిని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ ను విడుదల చేయాలని కోరుతూ ఆర్థికశాఖకు నివేదికలు అందిన 24 గంటల్లోనే.. యడియూరప్ప.. వాటిని మూసివేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు.
యడియూరప్ప..నీ కడుపు నిండితే సరిపోతుందా?
ఈ విషయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. అయిదు రూపాయలకే పేదల కడుపును నింపే ఇందిర క్యాంటీన్లను మూసేయడానికి ఎలా మనసొచ్చిందంటూ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన వరుసగా ట్వీట్లను సంధించారు. కర్ణాటక బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లను దాటించిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందని, అందులో నుంచి ఓ 300 నుంచి 400 కోట్ల రూపాయలను ఇందిర క్యాంటీన్ల కోసం కేటాయించలేరా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క బెంగళూరులోనే రోజూ మూడు లక్షలకు పైగా భోజనాలను సరఫరా చేసే ఇందిర క్యాంటీన్లను అవినీతి పేరుతో మూసేయడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని విమర్శించారు. దీనిపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.