ఈ జన్మలో సిద్దరామయ్య మళ్ళీ సీఎం కాలేడు, రాహుల్ గాంధీకి పెళ్లి కాదు: మాజీ డీసీఎం ఈశ్వరప్ప
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఊహల్లో ఉన్నారని, బంగారు పల్లెం, బంగారు కుర్చి కావాలని కలలు కంటున్నారని ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్. ఈశ్వరప్ప వ్యంగంగా అన్నారు. ఈ జన్మలో మళ్లి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కాలేడని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెళ్లి జరగదని కేఎస్ ఈశ్వరప్ప వ్యంగంగా అన్నారు.
గురువారం కుందగోళ శాసన సభ నియోజక వర్గం పరిదిలోని రట్టిగేరి గ్రామంలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేత కేఎస్. ఈశ్వరప్ప మాజీ సీఎం సిద్దరామయ్య మీద విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ఒక భిక్షగాడి కథను కేఎస్. ఈశ్వరప్ప చెప్పారు.
మాజీ సీఎం సిద్దరామయ్య నిత్యం ఊహల్లో విహరిస్తున్నారని ఎద్దేవచేశారు. ఈ జన్మలో సిద్దరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కాలేడని, రాహుల్ గాంధీకి అసలు పెళ్లి కాదని ఈశ్వరప్ప జోస్యం చెప్పారు. సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని ఆయనే పలువురు నేతలతో చెప్పిస్తున్నారని ఈశ్వరప్ప ఆరోపించారు.
సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని ఎవర్వూ చెప్పకూడదని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ హెచ్చరిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి గురించి ఎవరు చర్చలు జరపరాదని డీసీఎం డాక్టర్ జీ. పరమేశ్వర్ పదేపదే చెబుతున్నారని, అయినా కోందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఈశ్వరప్ప గుర్తు చేశారు.
ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతుందని, తరువాత కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేఎస్. ఈశ్వరప్ప జోస్యం చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుళ్లు రాజకీయాలు చేస్తోందని ఈశ్వరప్ప ఆరోపించారు.
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలను తీర్చుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఈశ్వరప్ప అన్నారు. సిద్దరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ నేతలు అంటుంటే సీఎం కుమారస్వామి మండిపడుతున్నారని ఈశ్వరప్ప గుర్తు చేశారు.
పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చాయని, అయితే ఈ ప్రభుత్వం పాలనతో ప్రజలు విసిగిపోయారని ఈశ్వరప్ప ఆరోపించారు. కుళ్లు రాజకీయాలతో డాక్టర్ జీ పరమేశ్వర్ ను గతంలో సిద్దరామయ్య ఓడించారని, తరువాత డాక్టర్ జీ పరమేశ్వర్ దేవేగౌడతో ఒప్పందం చేసుకుని చాముండేశ్వరిలో సిద్దరామయ్యను ఓడించారని బీజేపీ నేత ఈశ్వరప్ప ఆరోపించారు.