బీజేపి ఎత్తులకు పైఎత్తులు..! ఆపరేషన్ కమల్ ను అడ్డుకునే దిశగా సిద్ద, కుమారస్వామి..!!
కర్ణాటక/హైదరాబాద్ : కర్ణాటక లో అదికారం చేతులు మారకుండా ఉండేందుకు ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి. కుమార స్వామికి మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తోడు రావడంతో ఇద్దరూ కలిసి పకడ్బంధీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టడంతో సిద్ద రామయ్య, కుమార స్వామిలు ఆ ప్రభావం కర్ణాటక మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ముందుగా బీజేపి విసురుతున్న గాలానికి ఏ ఒక్క ఎమ్మెల్యే చిక్కకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
కర్ణాటకలో ఏకమైన సీఎం, మాజీ సీఎం..! ఆపరేషన్ కమల్ ను తిప్పకొట్టేందుకు యత్నం..!!
కర్ణాటక సర్కార్ కూలిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి సమాలోచనలు జరుపుతున్నారు. యడ్యూరప్ప సవాల్ ను ఇద్దరూ సీరియస్ గా తీసుకున్నారు. జూన్ 1 నాటికి ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న యడ్యూరప్ప వ్యాఖ్యలను అబద్ధం చేయాలని సిద్ధరామయ్య శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రతి శాసనసభ్యుడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రధానంగా అసమ్మతితో ఉన్న నేతల వద్దకు ఆయన వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాతే ఆపరేషన్ స్టార్ట్ చేయాలని కమలం పార్టీ భావిచింది.
సంకీర్ణ ప్రభుత్వం త్వరలో కూలి పోతుంది..! యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు..!!
మరి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇప్పటికే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు యడ్యూరప్పతో నేరుగా మాట్లాడినట్లు చెబుతున్నారు. వారికి యడ్డీ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించే యోచనలో కూడా బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కుమారస్వామి, సిద్ధరామయ్యలు అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా రమేష్ జార్ఖిహోళికి మంత్రి పదవి ఇస్తామన్న ప్రతిపాదనను ఆయన ముందుంచారు. అయితే ఆయన ఇందుకు అంగీకరించలేదని తెలసింది.
బీజేపి పాచికలు పారనివ్వం..! పకడ్బందీ ప్రణాళిక రచిస్తున్న కుమార, సిద్ద..!!
అలాగే మరో అసంతృప్త నేత మహేష్ కుమటహళ్లికి కూడా మంత్రి పదవి ఆఫర్ అందినట్లు సమాచారం. ఈయన కొంత మెత్తబడినట్లు చెబుతున్నారు. అవసరమైతే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిని తొలగించి కొత్త వారిని తీసుకోవాలన్న నిర్ణయానికి కుమారస్వామి, సిద్ధరామయ్య వచ్చారు. ఈ మేరకు జాబితాను సిద్ధం చేస్తున్నారు. సిద్ధరామయ్య మాత్రం తమ పార్టీ నుంచి ఎవరూ వెళ్లరని పైకి చెబుతున్నా లోపల మాత్రం ఆందోళన చెందుతున్నట్లే కన్పిస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు వివరించారు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన అధిష్టానం పార్టీ పెద్దలను కర్ణాటకకు పంపేందుకు సిద్ధమయింది.
అసంతృప్తులను అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్..! చేజారనివ్వమంటున్న సీఎం..!!
ఆపరేషన్ కమల్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి మంత్రివర్గ విస్తరణ ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోంది. కొత్త అసమ్మతులు తలెత్తేలోగా పాతవారిని బుజ్జగించడమే కాంగ్రెస్ వ్యూహమని తెలుస్తోంది. మరి బీజేపీ ఈసారైనా అధికారంలోకి వచ్చేందుకు ఛాన్స్ ఉందా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.