అదృశ్యానికి ముందు డీకేశికి ఫోన్ చేసిన కాఫీ కింగ్, మాట్లాడాలి, ధైర్యం ఎక్కువే, ఐటీ దాడి !
బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వి.జి. సిద్దార్థ అదృశ్యం కావడానికి ఒక్కరోజు ముందు ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ (డీకేశి)తో మాట్లాడారు. ఈ విషయంపై స్వయంగా మాజీ మంత్రి డీకే. శివకుమార్ సమాచారం ఇచ్చారు. ఆదివారం తనకు ఫోన్ చేసిన సిద్దార్థ మీతో మాట్లాడాలని, మీమ్మల్ని భేటీ కావాలని చెప్పారని డీకే. శివకుమార్ అన్నారు. మంగళవారం డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.
ధైర్యం ఎక్కువ !
తనకు ఫోన్ చేసిన సిద్దార్థ మీరు కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు అవుతున్నారా అని ఆరా తీశారని, అదేమి లేదని తాను సమాధానం చెప్పానని డీకే. శివకుమార్ అన్నారు. తనకు ఫోన్ చేసిన సమయంలో సిద్దార్థ మామూలుగా మాట్లాడారని, ఆయన ఆందోళతో ఉన్నట్లు తనకు అనిపించలేదని మాజీ మంత్రి డీకే. శివకుమార్ వివరించారు. సిద్దార్థ ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదని, ఆయన సమస్యల్లో ఉన్నారని తనకు తెలుసని, అయితే ఆ సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంటారనే నమ్మకం తనకు ముందు నుంచి ఉందని డీకే. శివకుమార్ వివరించారు.
దర్యాప్తు చెయ్యాలి
కేఫ్ కాఫీ డే యజమాని సిద్దార్థ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చెయ్యాలని మాజీ మంత్రి డీకే. శివకుమార్ డిమాండ్ చేశారు. ఎవరైనా సిద్దార్థను పిలుచుకుని వెళ్లారా ? ఆయనే ఏమైనా అఘాయిత్యం చేసుకున్నారా ? ఎవరైనా సిద్దార్థ మీద ఒత్తిడి చేశారా? అనే కోణాల్లో పూర్తిగా విచారణ జరగాలని మాజీ మంత్రి డీకే. శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐటీ అధికారుల విషయం మాట్లాడను
ఐటీ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని సిద్దార్థ లేఖలో రాశారనే విషయం గురించి తాను మాట్లాడను అని మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పారు. ఐటీ అధికారుల వేధింపుల గురించి తాను మాట్లాడనని, అన్ని వివరాలు విచారణలో వెలుగు చూస్తాయనే నమ్మకం తనకు ఉందని డీకే. శివకుమార్ అన్నారు.
ప్రతాప్ శెట్టి, జావెద్ లకు ఫోన్లు
సిద్దార్థ చివరిసారి ఆయన మేనేజర్, ఆర్థిక వ్యవహారాల సలహాదారుడు ప్రతాప్ శెట్టి, జావెద్ లకు ఫోన్ చేశారని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మా వాళ్ల సహాయంతో సిద్దార్థ ఆచూకి కోసం ఆరా తీస్తున్నామని, అయితే ఆయన అదృశ్యం అయ్యి 12 గంటలు దాటిపోయిందని, మా ఆశలు సన్నగిల్లుతున్నాయని మాజీ మంత్రి డీకే. శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.
ట్వీట్ లో సిద్దార్థ లేఖ
సిద్దార్థ, ఆయన కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాలుగా తనకు తెలుసని, ఆయన చాల సున్నితమైన వ్యక్తి అని డీకే. శివకుమార్ వివరించారు. రూ. వేల కోట్ల ఆస్తి ఉన్నా సాధారణ కారులో సిద్దార్థ సంచరించేవాడని, ఆయన వ్యక్తిత్వం చాల గోప్పదని డీకే. శివకుమార్ చెప్పారు. సిద్దార్థ అదృశ్యం కాకముందు రాశారు అంటున్న ఓ లేఖను మాజీ మంత్రి డీకే శివకుమార్ ట్వీట్ లో జత చేశారు. మొత్తం మీద కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ మాయం కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.