రేవంత్ రెడ్డి, నానా పటోల్ ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదా?, సిద్ధూ మోసగాడు: అమరీందర్ సింగ్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: కొత్త పార్టీ పెడతానని, బీజేపీతో పొత్తు ఉంటుందని ఇటీవల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఆయన వారి విమర్శలు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. అమరీందర్ సింగ్ సుమారు నాలుగు దశాబ్దాలకుపై కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్.. లౌకిక, సెక్యూలర్ పదాలు వాడొద్దన్న అమరీందర్ సింగ్
ముఖ్యంగా లౌకికవాదం గురించి కాంగ్రెస్ మాట్లాడటం మానేయాలని ఆ పార్టీకి అమరీందర్ సింగ్ చురకలంటించారు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారాన్ని పంచుకోవడాన్ని, బీజేపీతోపాటు ఆర్ఎస్ఎస్తో మూలాలున్న ఎంతో మంది నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని కీలక పదవులు కట్టబెట్టడాన్ని గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు. సెక్యూలర్ గురించి మాట్లాడటం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ హితవు పలికారు. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు అమరీందర్ సింగ్. సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తకు సిద్ధమేనని అమరీందర్ సింగ్ ప్రస్తావించడంపై పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జీ హరీశ్ రావత్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి, నానా పటోల్ ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదా?
ఈ నేపథ్యంలో ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు అమరీందర్ సింగ్. లౌకికవాదం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. 14 ఏళ్లపాటు బీజేపీలో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని మరవొద్దన్నారు. ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి కాకపోతే ఎక్కడ్నుంచి వచ్చారని అమరీందర్ సింగ్ నిలదీశారు. అకాలీదళ్లో నాలుగేళ్లపాటు ఉన్న పర్గత్ సింగ్... ఇప్పుడు కాంగ్రెస్ చేరిన విషయాలు గుర్తులేవా? అని ప్రశ్నించారు.
Recommended Video
సిద్ధూను నమ్మి కాంగ్రెస్ మునిగిపోతుంది..: అమరీందర్ సింగ్
మహారాష్ట్రలో శివసేనతో కలిసి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేంత వరకూ మతతత్వ పార్టీలుగా పిలవబడే వారితో జట్టుకట్టడం సరైందేనని మీరు చెబుతున్నారా? హరీశ్ రావత్ జీ..? అంటూ అమరీందర్ సింగ్ చురకలంటించారు. తన ప్రత్యర్థులుగా ఉన్న అకాలీదళ్తో కోర్టులో పోరాడతున్నట్లు అమరీందర్ సింగ్ చెప్పారు. అంతేగాక, 2017 నుంచి పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తున్నట్లు చెప్పారు. నవజ్యోత సింగ్ సిద్ధూ మోసగాడని, అతడ్ని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని వ్యాఖ్యానించారు.