కేజ్రీకి సిద్దూ కౌంటర్: గెస్ట్ లెక్చరర్లతో కలిసి ఆప్ చీఫ్ ఇంటి ఎదుట ధర్నా.ప్ల కార్డు పట్టుకొని మరీ, ఇదీ లెక్క
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం ఇప్పటినుంచే ప్రజలతో కలిసిపోతున్నారు. అయితే కాంగ్రెస్ నేత, పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ ముందు ఉంటున్నారు. ఆప్, బీజేపీకి ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల పంజాబ్లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో కూడా పాల్గొన్నారు.
ముందు అక్కడ..
గత నెలలో మొహాలీలో జరిగిన కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇవాళ ఢిల్లీలో గెస్ట్ టీచర్లు ఆందోళనకు దిగారు. వారితో కలిసి నిరసనలో సిద్దూ పాల్గొన్నారు. కేజ్రీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు కూడా ప్రదర్శించారు. పంజాబ్లో ప్రజలను ఆకర్షించడానికి వచ్చే ముందు.. మీ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించుకోవాలని సిద్ధూ సూచించారు.
నేడు ఢిల్లీలో సిద్దూ ఇలా
ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి బయట ప్రభుత్వ గెస్ట్ టీచర్లు చేశారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ సర్కార్పై తీవ్రస్థాయిలో సిద్దూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో 1031 ప్రభుత్వ పాఠశాలల్లో 196 పాఠశాలల్లో మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. 45 శాతం ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలలను 22 వేల మంది గెస్ట్ టీచర్లు రోజువారీ వేతనాలతో ప్రతి 15 రోజులకు కాంట్రాక్ట్ల పునరుద్ధరణతో నడుపుతున్నారని పేర్కొన్నారు.
ఆప్ కార్యకర్తలకే..
కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరిస్తామని,పర్మినెంట్ సిబ్బందితో సమానమైన వేతనాలు ఆప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం గెస్ట్ టీచర్లను నియమించడం ద్వారా పరిస్థితి మరింత దిగజారింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా, ఆప్ వాలంటీర్లు అని పిలవబడే వ్యక్తులు ప్రభుత్వ నిధుల నుండి సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తున్నారు, ఇది పాఠశాల అభివృద్ధికి ఉద్దేశించబడిందని సిద్ధూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. 2015 ఆప్ మ్యానిఫెస్టోలో ఢిల్లీలో 8 లక్షల కొత్త ఉద్యోగాలు, 20 కొత్త కాలేజీల ఏర్పాటుకు హామీ ఇచ్చారు, ఉద్యోగాలు, కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కేవలం 440 ఉద్యోగాలు ఇచ్చిందని విమర్శించారు. ఢిల్లీలో నిరుద్యోగిత రేటు గత 5 సంవత్సరాలలో దాదాపు 5 రెట్లు పెరిగిందని మరో ట్వీట్లో సిద్ధూ విమర్శించారు.
Recommended Video
ఎవరీ వ్యుహాం వారిదే..
వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ భావిస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరసగా పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్లో జోష్ నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. అయితే కేజ్రీవాల్ బలపడితే తమకు నష్టం తప్పదని భావిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. ఆమ్ ఆద్మీ వైపుకి ఓటర్లు మళ్లకుండా చూసే ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఢిల్లీ గెస్ట్ టీచర్లు చేసిన నిరసనలో సిద్ధూ పాల్గొన్నారు.