సిద్దూ వర్సెస్ అమరిందర్ సింగ్ : నన్ను ఒంటరిని చేశారు.. క్యాబినెట్ నుంచి బయటకొచ్చిన సిద్దూ
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్లింది పరిస్థితి. ఇన్నాళ్లు ఉన్న ప్రచ్చన్నయుద్ధం గురువారం బయటపడింది. సీఎం అమరిందర్ సింగ్ నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం నుంచి బయటకొచ్చి సంచలనం సృష్టించారు సిద్దూ.
మాటలు-మంటలు
వాస్తవానికి అమరిందర్ సింగ్, సిద్దూ మధ్య మొదటినుంచి మంచి సంబంధాలు లేవు. ఇద్దరు ఒకరు కస్సు కంటే మరొకరు బస్సు అనే పరిస్థితి. ఈ క్రమంలో గురువారం సీఎం అమరిందర్ సింగ్ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వచ్చిన సిద్దూ .. మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో అమరిందర్, సిద్దూ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తర్వాత మీడియాతో సిద్దూ మాట్లాడుతూ .. మంత్రివర్గ సమావేశంలో తను ఒక్కొడిని ఒంటరిని అని వాపోయారు. క్యాబినెట్ మొత్తం తనను ఏకాకిని చేసిందని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి మంత్రి సిద్దూ వైఖరి కారణమని సీఎం అమరిందర్ సింగ్ విమర్శించారు. దీనిపై సిద్దూ స్పందిస్తూ .. ఎన్నికల్లో విజయం, పరాజయం కామన్ అని పేర్కొన్నారు. దానిని అంగీకరించాలే తప్ప ఒకరిని బాధ్యుడిని చేసి విమర్శించడం సరికాదని సూచించారు.
అర్బన్లో హస్తం ప్రభావం ...
రాష్ట్రంలో పట్టణప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ లెక్కలకు సంబంధించిన పేపర్లను మీడియాకు చూపించారు. పట్టణ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారని విషయాన్ని గుర్తుచేశారు సిద్దూ. ఇది 63 శాతమని పేర్కొన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వెనుకబడ్డామని అంగీకరించారు. ఇది తక్కువ శాతం ఏం కాదని .. 55 శాతం ఓటు షేర్ కాంగ్రెస్ పార్టీ సాధించిందని పేర్కొన్నారు.
మరి ఇక్కడ ఏంటీ ?
అమృత్ సర్ సహా జలంధర్, లుధియానా, పాటియాలా, ఎస్ఏఎస్ నగర్ పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 50కి చేరుకొందని వివరించారు సిద్దూ. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పడం సరికాదని సిద్దూ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎం అమరిందర్ సింగ్కు స్వయంగా వెళ్లి కూడా చెప్పారు. కానీ అమరిందర్ మాత్రం సాంప్రదాయ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని అంటున్నారు. బటిండా, గురుదాస్ పూర్ స్థానాలను కోల్పోయామని గుర్తుచేశారు. ఇవీ పట్టణాలు కాదా అని సిద్దూను నిలదీశారు అమరిందర్ సింగ్.
కాంట్రవర్సీ కామెంట్లు ...
సిద్దూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చాయని అమరిందర్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ వెళ్లి ఆ దేశ ఆర్మీ చీఫ్ను సిద్దూ కౌగిలించుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతకుముందే పంజాబ్ ఎన్నికల ఫలితాల గురించి అమరిందర్ మీడియాకు వివరించారు. కేవలం సిద్దూ వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం తగ్గిందని గుర్తుచేశారు. అయితే వీరిమధ్య మరింత మాటలయుద్ధం జరగడానికి టికెట్ల గొడవ అని తెలుస్తోంది. సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీకి టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినా .. నవజ్యోత్ కౌర్ తిరస్కరించినా సంగతి తెలిసిందే. అయితే అమరిందర్ టికెట్ ఇవ్వలేదని సిద్దూ ఆరోపించారు. వాస్తవానికి అమరిందర్, సిద్దూ మధ్య జరుగుతున్న మాటలయుద్ధంతో విసిగి, వేసారి పోటీ చేసేందుకు నవజ్యోత్ కౌర్ వెనుకాడిన సంగతి తెలిసిందే.