సిద్ధును టార్గెట్ చేయడంపై ఇమ్రాన్ఖాన్ ఆగ్రహం, మనం ముందుకెళ్లాలంటే..
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అండగా నిలిచారు. సిద్ధూను ఆయన శాంతికి బ్రాండ్ అంబాసిడర్గా పేర్కొన్నారు. సిద్ధూను వివిధ పార్టీ నేతలు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు, భారత్తో చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని సంకేతాలు ఇచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో స్పందించారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన సిద్ధూకు థ్యాంక్స్ చెప్పారు. సిద్ధూ శాంతికి అంబాసిడర్ అన్నారు. అతను ఎంతో ప్రేమ పంచాడని, పాకిస్తాన్ ప్రజలు కూడా అతనికి ప్రేమను పంచారని చెప్పారు.
శాంతిలేకుండా అభివృద్ధి జరగదు
పాకిస్తాన్ పర్యటనలో సిద్ధూ చర్యలపై విమర్శలు గుప్పించేవారు రెండు దేశాల శాంతిని కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. శాంతి లేకుండా మన ప్రజలు అభివృద్ధి నోచుకోరని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారం అనే అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు.
చర్చల ద్వారా పరిష్కారం
భారత్, పాకిస్తాన్లు చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అప్పుడే మనం ముందుకు సాగుతామన్నారు. పేదరికాన్ని రూపుమాపాలన్నా, ప్రజలను పైకి తీసుకు రావాలన్నా భారత్, పాకిస్తాన్లలోని సమస్యలను, విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అన్నారు.
వారిని లాగి సిద్ధూ ఆగ్రహం
తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై సిద్ధూ కూడా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో తన కౌగిలింతను కొందరు కావాలని రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. తనన దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాకిస్తాన్ వెళ్లిన వాజపేయి, ప్రధాని నరేంద్ర మోడీలు అక్కడి నాయకులను కౌగిలించుకోలేదా అని ప్రశ్నించారు. కావాలనే కొందరు రాద్దాంతం చేస్తున్నారన్నారు.
శివసేన ఆగ్రహం
కాగా, ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆ దేశ ఆర్మీ చీఫ్ను మాజీ క్రికెటర్ సిద్ధు ఆలింగనం చేసుకున్నారు. దీనిపై శివసేనతో పాటు మరికొందరు నేతలు మండిపడ్డారు. అది సిగ్గుమాలిన చర్యగా శివసేన అభివర్ణించింది. నోట్ల రద్దును విమర్శించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించినవారు సిద్ధూపై అలాంటి ముద్రవేయకపోవడమేమిటని బీజేపీని ప్రశ్నించింది. దీనిపై ఇమ్రాన్, సిద్ధూలు స్పందించారు. మోడీని, పెద్దనోట్ల రద్దును విమర్శించిన వారిని దేశ వ్యతిరేకులుగా అప్పట్లో ముద్ర వేశారని, అలాంటిది పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఆర్మీ చీఫ్ను హత్తుకున్న సిద్ధూపై అలాంటి ముద్ర వేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఒకప్పుడు నవాజ్ షరీఫ్ను మోడీ ఆలింగనం చేసుకుంటే గొప్ప చర్యగా అభివర్ణించినప్పుడు సిద్ధూను మాత్రమే ఎందుకు బాధ్యులను చేయాలని మోడీని కూడా టార్గెట్ చేసింది శివసేన. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్కు కూడా ఆహ్వానం అందినా వారు హాజరు కాలేదని శివసేన గుర్తుచేసింది. సిద్ధూ మాత్రమే వెళ్లి తన నకిలీ దేశభక్తిని నిరూపించుకున్నారన్నారు. ఒకవేళ పాక్పై అంత ప్రేమే ఉంటే అక్కడికే వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చింది. సిద్ధూపై రాహుల్ గాంధీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. భారత్పై అక్కసు వెళ్లగక్కే వ్యక్తి ఇమ్రాన్ అని, ఆయన వల్ల దేశానికి మరిన్ని తలనొప్పులు తప్పవని హెచ్చరించింది.