సిద్ధూ హగ్ ఫలితం: పాక్ గురుద్వారాలోకి భారతీయులకు అనుమతి
ఢిల్లీ: మాజీ క్రికెటర్ పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవలే వార్తల్లో నిలిచారు. తనకు ఆత్మీయ స్నేహితుడు మాజీ క్రికెటర్ ప్రస్తుత పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు తన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు సిద్దూ. అయితే అక్కడ చోటుచేసుకున్న ఒక సందర్భంతో సిద్దూ భారత్లో విమర్శలపాలయ్యాడు. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే ఆయన్న టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక బీజేపీ వారు కూడా సిద్దూపై మాటల యుద్ధానికి దిగారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార సమయంలో అదే వేదికపై ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ కమర్ జావెద్ బాజ్వాను సిద్ధూ కౌగలించుకోవడంపై విమర్శలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు ఆ కౌగలింతే పాక్లో నివసిస్తున్న భారతీయులకు కొంత మేలు కలిగించేలా దోహదం చేసిందని పలువురు మేధావులు మాట్లాడుకుంటున్నారు.
సిద్ధును టార్గెట్ చేయడంపై ఇమ్రాన్ఖాన్ ఆగ్రహం
ఇక అసలు విషయానికొస్తే పాక్ లో నివసిస్తున్న భారతీయులకు ఎప్పటి నుంచో ప్రవేశం లేని కర్తపూర్ సాహిబ్ ఆలయంలోకి ప్రవేశం కల్పించింది పాక్ ప్రభుత్వం. ఇది కేవలం సిద్దూ... కమర్ జావెద్ను కౌగలించుకోవడంతోనే జరిగిందని విశ్వసనీయ సమాచారం. పాకిస్తాన్ ఛీఫ్ను ఎందుకు కౌగలించుకున్నారని సిద్ధూను ప్రశ్నించినప్పుడు... పాకిస్తాన్లోని కర్తాపూర్ సాహిబ్ ఆలయంలోకి భారతీయులకు ప్రవేశం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందని తనతో జావెద్ చెప్పారని అందుకే తనను హగ్ చేసుకున్నట్లు సిద్ధూ సమాధానంగా చెప్పాడు. సిద్దూ చెప్పినట్లుగానే పాక్ ప్రభుత్వం కర్తాపూర్ సాహిబ్ ఆలయంలోకి భారతీయులకు ప్రవేశం కల్పించి మాటనిలబెట్టుకుందని పాక్ ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. నవంబర్లో సిక్కు మత గరువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తాపూర్ సాహిబ్ ఆలయంలోకి పాక్లో నివాసముంటున్న భారతీయులకు ప్రవేశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
కర్తాపూర్ సాహిబ్ ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని పాక్లో నివసిస్తున్న భారతీయులు కొన్నేళ్లుగా అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నరు. తాను పాక్ ఆర్మీ ఛీఫ్ను కౌగలించుకోవడం వల్ల అక్కడ నివసిస్తున్న పంజాబీలకు సిక్కులకు ఎంతో మేలుకలిగిందని సిద్దూ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు భారతీయులకు కర్తాపూర్ సాహిబ్ ఆలయంలోకి ప్రవేశం కల్పించాలన్న నిర్ణయం తీసుకున్న పాక్ ప్రధాని తన స్నేహితుడు ఇమ్రాన్ఖాన్కు కృతజ్ఞతలు తెలిపాడు సిద్దూ. అంతేకాదు కృతజ్ఞతలు తెలిపేందుకు మళ్లీ పాకిస్తాన్కు వెళ్లేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సిద్ధూ తెలిపారు. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ నుంచి ఇంకా అధికారికంగా భారత్కు సమాచారం రావాల్సి ఉంది.