ఏపీ, తమిళనాడు, బీహార్లో కరోనా తగ్గుముఖం- సెప్టెంబర్లో ఆశాజనక పరిస్ధితులు..
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతున్నా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్ధితులు క్రమంగా అదుపులోకి వచ్చేస్తున్నాయి. మొదట్లో కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో ముందున్న పలు రాష్ట్రాలు ఇప్పుడు కోలుకుంటున్నాయి. దీంతో ఆంక్షల్లోనూ సడలింపు ఇస్తున్నారు. రోజువారీ నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఏపీ, బీహార్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. పెరుగుతున్న కరోనా పరీక్షల సంఖ్యతో పాటు ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదే పరిస్ధితి మరో నెల రోజులు కొనసాగితే దాదాపు కరోనా అదుపులోకి వచ్చినట్లేనని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.
మూడు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం...
దక్షిణాదిలోని ఏపీ, తమిళనాడుతో పాటు ఉత్తరాదిన ఉన్న బీహార్లోనూ కరోనా ప్రభావం భారీగా తగ్గుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య బాగా తగ్గింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనపిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంటోంది. ఐసీఎంఆర్ మార్దదర్శకాలను కూడా కచ్చితంగా అమలు చేస్తుండటంతో పరిస్ధితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక పరీక్షలు ఏపీలోనే జరుగుతుండగా.. బీహార్, తమిళనాడులోనూ భారీగానే వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. బీహార్, తమిళనాడులో కరోనా వైరస్ వృద్ధికి రోజుకు ఒకశాతం కంటే తక్కువగానే ఉందంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.
టాప్ 10 నుంచి బయటపడ్డ బీహార్..
నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న బీహార్లో కరోనా నియంత్రణకు కేంద్రం భారీగా చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దీంతో రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 2 వేలకు దగ్గర్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే టాప్ 10 రాష్ట్రాల జాబితా నుంచి బీహార్ బయటపడింది. బీహార్ స్ధానంలో అత్యధిక కేసులు నమోదవుతున్న కేరళ టాప్ 10లో చేరింది. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుండటంతో రాష్ట్రంలో క్రమంగా పరిస్ధితులు అదుపులోకి వస్తున్నాయి.
తమిళనాడులోనూ తగ్గుదల..
ఆగస్టులో రోజుకు ఆరు వేల కేసులు నమోదైన తమిళనాడులో ఇప్పుడు ఆశాజనక పరిస్ధితులు కనిపిస్తున్నాయి. కరోనా పరీక్షల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా టాప్లో ఉంది. దీంతో సెప్టెంబర్ నెలలో ఆరు వేల మార్క్ నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ వైరస్ వృద్ధి రేటు చూసినా కేవలం ఒక్కశాతం లోపే ఉండటం విశేషం. గతంలో కరోనా హాట్స్పాట్ల సంఖ్య కూడా ప్రస్తుతం భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ నెలలో తమిళనాడులో పరిస్ధితులు మరింతగా అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. దీంతో కేంద్రం ప్రకటిస్తున్న అన్లాక్ మార్గదర్శకాలు యథావథిగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.
Recommended Video
ఏపీని మార్చేసిన సెప్టెంబర్....
ఏపీలో ఆగస్టు నెలలో 10 వేలకు పైగా రోజువారీ కొత్త కేసులు నమోదయ్యేవి. సెప్టెంబర్ నెల ఆరంభంలోనూ రోజుకు పదిన్నర వేల కేసులు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య ఆరు వేలకు పరిమితం అవుతోంది. అంటే నెల రోజుల్లోపే రోజు వారీ కేసుల సంఖ్య నాలుగు వేలు తగ్గిపోయింది. కొత్త కేసుల సంఖ్యలో ఇంత భారీ స్దాయిలో మార్పు దేశంలో ఎక్కడా లేదు. మూడు వారాల వ్యవధిలోనే ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 40 శాతం తగ్గిపోయింది. గత నెలలో లక్షకు పైగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 60 వేలకు తగ్గిపోయాయి. మరణాల సంఖ్య కూడా కేవలం 30-40కే పరిమితమవుతుండటంతో ప్రభుత్వానికి భారీ ఊరట లభిస్తోంది. ప్రస్తుతం ఏపీలో భారీగా కరోనా పరీక్షలు జరుగుతూ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అక్టోబర్ చివరి నాటికి కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.