సీఎంని చేస్తే.. నాకే నరకం చూపించాడు: ఇన్నాళ్లకు ఆవేదన వెళ్లగక్కిన ములాయం
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తొలిసారి పెదవి విప్పారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తొలిసారి పెదవి విప్పారు. కొడుకు అఖిలేష్ యాదవ్ పై శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తన కొడుకే తనను గౌరవించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏన్నడూ తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదన్నారు. తనను గౌరవించని అఖిలేష్ ను ప్రజలు కూడా గౌరవించలేదని వ్యాఖ్యానించారు.
ఐదేళ్లుగా అవమానాలే...
ఐదేళ్లుగా తాను అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నానన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై ాయన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎంని చేస్తే.. మాకే రివర్స్...
‘‘తండ్రిని వంచించిన కొడుకు ఇతరులకు కూడా మిత్రుడు కాలేడు. ఏ తండ్రీ తన జీవిత కాలంలో తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయలేదు. కానీ నేను అఖిలేష్ ను ముఖ్యమంత్రిని చేశాను. ఇందుకు ప్రతిగా వాడు ఏం చేశాడు? తన సొంత చిన్నాన్ననే ప్రభుత్వం నుంచి తొలగించాడు..'' అని అఖిలేష్ పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ తో పొత్తుతోనే చిచ్చు...
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తును ములాయం వ్యతిరేకించినప్పటి నుంచి అఖిలేష్ వేరు కుంపటి పెట్టారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు చేజిక్కించుకుని తమదే అసలైన సమాజ్ వాదీ పార్టీ అని, తమకే సైకిల్ గుర్తు కేటాయించాలని ఈసీని కూడా ఆశ్రయించారు.
పార్టీ గుర్తు కూడా లాగేసుకున్నాడు...
ములాయం కూడా పార్టీ ఆవిర్భావం తనతోనే జరిగిందని, సైకిల్ గుర్తు తమదేనంటూ ఈసీని ఆశ్రయించారు. కానీ చివరికి ఈసీ.. సైకిల్ గుర్తును అఖిలేష్ కే కేటాయించడం, ములాయం అభిప్రాయానికి భిన్నంగా అఖిలేష్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ములాయం కుటుంబ విభేదాలు రచ్చకెక్కాయి.
తగ్గుముఖం పట్టని విభేదాలు...
పర్యవసానంగా ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఓటమి పాలైంది. ప్రతిపక్ష పాత్రకే ఆ పార్టీ పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా అఖిలేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఆ సమావేశానికి కూడా ములాయం దూరంగా ఉండడంతో ఈ తండ్రీకొడుకుల మధ్య విభేదాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదని అర్థమవుతోంది.