కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. తొలిరోజు కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాలలో టీకాలు ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి వ్యాక్సిన్ ను అందించిన అదర్ పూనవల్లా కూడా నేడు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు.
ఈ రోజు తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవటంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్
కరోనా వ్యాక్సిన్ భద్రతను తెలియజేయడం కోసం టీకా తీసుకున్న సీరం సిఈవో
ఈరోజు సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనవల్లాకు కోవిషీల్డ్ మొదటి డోసును ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ పై ఉన్న భయాందోళనలు దూరం చేయడం కోసం తాను ఈ వ్యాక్సిన్ ను తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ భద్రతను దాని సమర్థతను తెలియజేయడం కోసం తాను వ్యాక్సిన్ షాట్ తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో తను వ్యాక్సిన్ తీసుకున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
వ్యాక్సిన్ పంపిణీలో ప్రధాని మోడీ, యావత్ భారతావని విజయం సాధించాలన్న అదర్ పూనవల్లా
ఎవరు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోడీ, యావత్ భారతావని విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు ఇలాంటి చారిత్రక ఘట్టం లో తమ కంపెనీకి చెందిన కోవిషీల్డ్ కూడా భాగస్వామి కావడం తనకు గర్వంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. అంతేకాదు టీకా భద్రతా మరియు సమర్థతపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించడం కోసం ఈరోజు ఆరోగ్య కార్యకర్తలతో పాటు తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు.
మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో కోవిషీల్డ్
ఆక్స్ఫర్డ్ , ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ టీకాలను అత్యవసర వినియోగం కోసం కేంద్ర అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే . టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సీరం సంస్థ నుండి 1.1 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తోంది.
చారిత్రక ఘట్టంలో భాగస్వామినయ్యానని వెల్లడి
భారతదేశానికి కరోనా వ్యాక్సిన్ ను అందించడంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక భూమిక పోషిస్తుంది. మొన్నటికి మొన్న కరోనా వ్యాక్సిన్ మొదటి డోసుల రవాణా సమయంలో కూడా అదర్ పూనవల్లా భావోద్వేగానికి గురికాగా, నేడు కరోనా వ్యాక్సిన్ షాట్ తీసుకొని చారిత్రక ఘట్టంలో భాగస్వామిని అయ్యానని పేర్కొన్నారు.